కొన్ని నెలల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని ఈఎస్ఐలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడే అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈఎస్ఐ కి సంబంధించి భారీ అవినీతి బయటపడింది. ఏపీ ఈఎస్ఐలో భారీగా అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు ఫిబ్రవరి 21, శుక్రవారం నాడు ఒక నివేదికను విడుదల చేశారు. ఔషధాలు, పరికరాలు కొనుగోలు అంశంలో రూ.404 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు విజిలెన్స్ అధికారులు తేల్చారు. 2014వ సంవత్సరం నుంచి 2019 వరకు ఈఎస్ఐలో జరిగిన కొనుగోళ్ల పత్రాలను విజిలెన్స్ అధికారులు పరిశీలించగా, ఆసమయంలో బాధ్యతలు నిర్వహించిన ముగ్గురు డైరెక్టర్లు, ఆరుగురు జాయింట్ డైరెక్టర్లు ఈ అవకతవకల్లో ముఖ్యపాత్ర పోషించారని అధికారులు వెల్లడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 4 ఈఎస్ఐ ఆస్పత్రులు, 78 ఈఎస్ఐ డిస్పెన్సరీలకు ఔషధాలు, పరికరాలు కొనుగోలు మరియ 3 డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటులో అవినీతి జరిగిందని పేర్కొన్నారు. ఈఎస్ఐలో బయటపడ్డ అవినీతిపై విజిలెన్స్ అధికారులు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించనున్నారు. ఈఎస్ఐ కుంభకోణంపై ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్పందిస్తూ, విజిలెన్స్ నివేదిక ఆధారంగా అవినీతికి బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. వారు అక్రమంగా కొల్లగొట్టిన బిల్లుల సొమ్మును రికవరీ చేస్తామని అన్నారు. ఈ కుంభకోణంలో గత ప్రభుత్వ మంత్రులకు సంబంధాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయని, ఈ అవకతవకలతో సంబంధమున్న ఎవరినైనా వదిలిపెట్టబోమని మంత్రి జయరాం స్పష్టం చేశారు.
[subscribe]