ప్రధాని నరేంద్ర మోదీకి సలహాదారులుగా విశ్రాంత ఐఏఎస్ అధికారులైన భాస్కర్ కుల్బే, అమర్జీత్ సిన్హాలను నియమించారు. కేబినెట్ నియామక కమిటీ వీరి నియామకానికి ఆమోదం తెలపడంతో ఫిబ్రవరి 21, శుక్రవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి కార్యదర్శి స్థాయి హోదా, వేతనం అందనున్నాయి. వీరిద్దరినీ రెండేళ్ల పాటు ప్రధాని మోదీ సలహాదారులుగా నియమించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారులైన వీరు 1983 బ్యాచ్కు చెందినవారు. పశ్చిమ బెంగాల్ కేడర్ చెందిన భాస్కర్ కుల్బేకు గతంలో పీఎంవోలో పనిచేసిన అనుభవం ఉంది.
అలాగే బీహార్ కేడర్ కు చెందిన అమర్జీత్ సిన్హా రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీగా పనిచేసి గతేడాది పదవీ విరమణ పొందారు. కేబినెట్ నియామక కమిటీ ఆమోదం అనంతరం పూర్తి వివరాలతో ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 22, శనివారం నాడు ఇంటర్నేషనల్ జ్యుడిషియల్ కాన్ఫరెన్స్ (ఐజెసి)ని ప్రారంభించారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలోని అదనపు భవనంలో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.
[subscribe]