ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తుని రైలు దగ్ధం కేసులో విజయవాడ రైల్వే కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీనిలో సరైన ఆధారాలు లేని కారణంగా కేసులో నిందితులుగా ఉన్న 41 మందిపై పెట్టిన కేసును అక్రమ కేసుగా పరిగణిస్తున్నామని స్పష్టం చేసింది. దీంతో మొత్తం 41 మంది నిందితులపై పెట్టిన కేసులను కొట్టివేసింది. ఈ మేరకు సోమవారం రైల్వే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా ముగ్గురు రైల్వే అధికారులు విచారణను సక్రమంగా నిర్వహించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దగ్ధమైన రైలులో వందల మంది ప్రయాణిస్తే, కేవలం ఒక్కరిని మాత్రమే ప్రశ్నించడం ఏమిటని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంత సున్నితమైన అంశాన్ని ఐదేళ్లుగా ఎందుకు సాగదీశారని ప్రశ్నించిన కోర్టు.. బాధ్యులైన పోలీసు అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని కోరింది.
కాగా 2016 నాటి ఈ కేసులో నిందితుల జాబితాలో ఏ1గా ముద్రగడ పద్మనాభం, ఏ2గా ఆకుల రామకృష్ణ, ఏ3గా ప్రస్తుతం మంత్రిగా ఉన్న దాడిశెట్టి రాజా సహా మొత్తం 41 మందిపై రైల్వే పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. అయితే 24 మంది సాక్షుల్లో 20 మంది కోర్టుకు హాజరు కాగా వారిలో ఐదుగురు సాక్షులు తమకు తెలియదని వాదించారు. ఇక 2016 జనవరిలో కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం సహా పలువురు కాపు ఉద్యమ నేతల ఆధ్వర్యంలో రిజర్వేషన్ల కోసం కాపుల ఆందోళనలో భాగంగా రైలు రోకోకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కొందరు ఆందోళనకారులు తుని రైల్వే స్టేషన్ సమీపంలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైలుకు నిప్పుపెట్టి తగులబెట్టారు. దీనిపై నాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 69 కేసులను నమోదు చేసింది. అయితే ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాటిని ఉపసంహరించుకుంది. ఈ క్రమంలోనే నేడు విజయవాడ రైల్వే కోర్టు ఏకంగా కేసునే కొట్టివేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE