హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్బండ్ సమీపంలోని నెక్లెస్ రోడ్డులో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 3వ తేదీన మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా దీనిని ప్రారంభించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న మొట్టమొదటి నీరా కేఫ్ ఇదే కావడం గమనార్హం. ఇక్కడ తాటి చెట్ల నుండి పులియబెట్టని మధురమైన తాజా నీరాను వినియోగదారులకు అందించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి తెలంగాణ పర్యాటక శాఖ ఎండీ మనోహర్తో కలిసి ఆయన దాదాపు రూ.20 కోట్లతో ఏర్పాటు చేస్తున్న నీరా కేఫ్ను పరిశీలించారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నీరా పాలసీ విధానం మేరకు తెలంగాణ వ్యాప్తంగా గుర్తించిన ప్రాంతాల్లో నీరా కేఫ్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. గీత కార్మికులకు మేలు చేసే లక్ష్యంతో సీఎం కేసీఆర్ నీరా విధానాన్ని ప్రకటించారని, ఈ అవకాశాన్ని సంఘం సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇక ఈ కేఫ్లకు నీరా సరఫరా చేసేందుకు మొత్తం ఐదు ప్రాంతాల్లో నీరా ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రంగారెడ్డి జిల్లా చెరికొండ, సంగారెడ్డి జిల్లా మునిపల్లి, నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ, యాదాద్రి జిల్లా నందనం, నల్గొండ జిల్లా సర్వాయిల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE