ఏపీలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నా కూడా ఇప్పటి వరకూ ఒక్క కాపు నేత కూడా ముఖ్యమంత్రి కాలేకపోయారు. సంఖ్యా బలంగా వీరి సంఖ్య ఎక్కువే ఉన్నా..ఆ సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తేవడం ఇప్పటి వరకూ ఎవరి తరం కూడా కాలేదన్న వాస్తవాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే.
కాపులను ఏకతాటి పైకి తీసుకురావడానికి తొలిసారిగా దివంగతనేత వంగవీటి మోహన్ రంగ మంచి ప్రయత్నమే చేశారు. అప్పట్లో ఆయన ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కాపుల ఆరాధ్య దైవంగా మారారు. ఆయన దారుణ హత్యకు గురి కాకపోతే కాపుల చిరకాల వాంఛ అయిన ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకునేవారే.ఆయన మరణం కాపు జాతికి లోటుగానే చెబుతారు. ఆయన చనిపోయాక ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా..ఇప్పటికీ కాపు జాతిని ఏకతాటి పైకి తీసుకురావడం ఎవరి తరం కూడా కాలేదు.
కాపుల రాజ్యాధికారం కోసం జరుగుతున్న ప్రయత్నంలో.. కొంతమంది నేతల తప్పటడుగులు కాపులకు శాపంగా మారుతున్నాయి. టీడీపీతో విభేదించి మరీ అప్పట్లో కాపు రిజర్వేషన్ ఉద్యమం వైపు ముద్రగడ పద్మనాభం అడుగులు వేసినా..అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయారు. ఏపీ రాజకీయాల్లో ఆయన ఒక పావుగా మారిపోయారు తప్ప కాపులకు ఒరిగిందేమీ లేకుండా పోయింది.
2009లో ప్రజారాజ్యం రూపంలో ఒక అరుదైన అవకాశం వచ్చినా… కాపు ఉద్యమ నేతగా ఉన్న ముద్రగడ లాభాపేక్షకు లొంగి కాంగ్రెస్ వైపే అడుగులు వేశారు. ఆ ఎన్నికల్లో కాపునేత అయి ఉండీ కూడా ముద్రగడ ..చిరంజీవికి ఎటువంటి మద్దతు తెలపలేదు. ఇక్కడే కొంతమంది కాపుల ఓట్లు చీలిపోయాయి. ప్రజారాజ్యం పార్టీ కాపుల మనసు దోచుకున్నా..ఏకపక్షం మద్దతు కూడా కూడగట్టుకోలేకపోయింది.
ఆ తర్వాత రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్లో అధికారం కాపులదే అన్న ప్రచారం జరిగింది. కానీ టీడీపీ, వైసీపీ ఆడిన మైండ్ గేమ్లో కాపు నేతలు చిక్కుకుని వారికి పావులుగా మారిపోయారు. దీంతో 2014లో టీడీపీని, 2019లో కాపు సామాజిక వర్గం నుంచి జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ను కాదని .. వైసీపీనే కాపులు ఆదరించారు. రెండు బలమైన కాపు నియోజకవర్గాలయిన భీమవరం, గాజువాకలో పోటీకి దిగిన పవన్ .. రెండు చోట్ల ఓడిపోయారు.
ఆ విషయాన్నే ఇప్పుడు పవన్ పదే పదే మాట్లాడుతున్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కనీసం తనను కాపు సామాజిక వర్గానికి చెందినవారెవరు కూడా గుర్తించలేదని.. ఇప్పుడు మాత్రం సీట్ల గురించి, పొత్తుల గురించి తనను ప్రశ్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. తమ వాడు అంతాగా భావిస్తే..తనను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా అని పవన్ సూటిగానే ప్రశ్నిస్తున్నారు. అందుకే తనను ప్రశ్నించే అధికారం లేదని కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు.
ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో పెద్దలుగా భావించే హరి రామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం వంటి వాళ్లను పవన్ పాయింట్ అవుట్ చేసి మరీ తప్పుపడుతున్నారు. కావాల్సిన సమయంలో సహాయం చేయకుండా తన మానాన తాను పని చేస్తుంటే ఇప్పుడు సలహాలు ఇవ్వడం ఎంత వరకూ కరెక్ట్ అని తేల్చి చెబుతున్నారు. తన పార్టీకి తనకు వ్యూహాలు ఉన్నాయంటూ గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు.
పవన్ కళ్యాణ్ మాటలతో జనసేన అధినేతను నిత్యం తమ లేఖలతో ఇబ్బంది పెడుతున్న హరి రామ జోగయ్య, ముద్రగడ పద్మనాభంలపై అందుకే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.నిజానికి వీరిద్దరి వెంట కాపు కులం ఉందా? కాపు కులం కోసం జోగయ్య, ముద్రగడ ఎప్పుడైనా సరే చిత్తశుద్ధితో పని చేశారా అన్న విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.
నిజమే ఈ ఇద్దరు నేతలు సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. అక్కడ కీలక పదవులను అలంకరించారు. ఆ సమయంలో ముద్రగడకు, హరిరామ జోగయ్యకు కాపులు గుర్తుకు రాలేదా అన్న ప్రశ్న తలెత్తుతుంది. కేవలం ఆ ఇద్దరి వ్యక్తిగత ఉనికి కోసం, తమకోసం , తమ బిడ్డల రాజకీయ ప్రయోజనాల కోసం పవన్ పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
వీరిద్దరి చర్యలు ఏపీ వాసులు జాగ్రత్తగా గమనిస్తున్నారని.. వీరి ప్రభావం కాపు సామాజిక వర్గంపై ఏమాత్రం ఉండదని కాపు సామాజిక వర్గంలోనూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది. పవన్ క్రేజ్ ను వీరి మాటలు దెబ్బతీయలేవని తేల్చి చెబుతున్నారు.నిజానికి కాపు పెద్దలుగా చలామణి అవుతున్న వీరి వెనుక వైసీపీ హస్తముందన్న అనుమానం బలపడుతోందని అంటున్నారు.
వైసీపీలో హరి రామ జోగయ్య కొద్దిరోజులు యాక్టివ్ గా పని చేయగా.. ముద్రగడ కూడా వైసీపీ కోసం పనిచేసిన సందర్భాలున్నాయి. అందుకే వీరు వరుసగా సంధిస్తున్న లేఖాస్త్రాలకు కాపుల నుంచి పెద్దగా స్పందన లేదని తెలుస్తోంది. ఒకప్పుడు ఈ ఇద్దరికీ కాపుల్లో చరిష్మ ఉన్నా ఇప్పుడు అదంతా గతంగా మారిపోయింది. అందుకే తాము రాజకీయంగా ఎదగడానికి కాపు అస్త్రంతో పవన్ ను అడ్డం పెట్టుకొనొ రాణించాలని చూస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY