చేగొండి వెంకట హరిరామజోగయ్య.. మాజీ ఎంపీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి.. వంటి పదవులు, హోదా కంటే.. కాపునేతగానే ఆయనకు గుర్తింపు. అదే ఆయన ఇష్టపడతారు కూడా. అనుక్షణం కాపుజాతి కోసమే పరితపిస్తున్నట్లుగా చెప్పుకుంటారు. 87 వయస్సులోనూ కాపులకు అధికారం కోసమే ఆలోచిస్తున్నానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్కు చాలాసార్లు సలహాలు ఇస్తూ వచ్చారు. తెలుగుదేశం-జనసేన పొత్తు, జనసేన సీట్లు, పవన్ రెండేళ్లు ముఖ్యమంత్రి అడగాల్సిందంటూ సూచనలు.. ఇలా చాలా అంశాలపై సలహాలు ఇస్తూ లేఖల మీద లేఖలు రాశారు. ఏమైందో ఏమోకానీ.. ‘తెలుగుదేశం, జనసేన బాగు కోరి నేనిచ్చే సలహా అధినేతలు ఇద్దరికీ నచ్చినట్టు లేదు. అది వారి ఖర్మ. నేను చేయగలిగింది ఏమి లేదు’ అని జోగయ్య తాజాగా మరో లేఖ రాశారు.
ఆ లేఖలు, పవన్ కు ఇచ్చి సలహాలు సంగతి పక్కనబెడితే.. ఆయన కుమారుడు చేగొండి సూర్యప్రకాశ్ వైసీపీలో చేరడం సంచలనంగా మారింది. కాపులకు గత టీడీపీ ప్రభుత్వం 5 శాతం రిజర్వేషన్లు ప్రకటించింది. కానీ అమలు చేయలేదు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను ఎత్తేసింది. కాపులకు రిజర్వేషన్లు ఎత్తివేయడంపై అప్పట్లో హరిరామజోగయ్య వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహారదీక్షలు చేశారు. ఇప్పుడు అలాంటి వైసీపీలోకి ఆయన కుమారుడు చేగొండి సూర్యప్రకాశ్ చేరడం చర్చనీయాంశంగా మారింది. కాపుల ఐక్యత గురించి, కాపుల రిజర్వేషన్ల గురించి నేతలకు సలహాలు, సూచనలు ఇచ్చే హరిరామజోగయ్య.. వైసీపీలో చేరమని కుమారుడికి ఆయనే సలహా ఇచ్చారా.. అని సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కాపు రిజర్వేషన్ల అమలుపై గతంలో చేగొండి హరిరామ జోగయ్య డెడ్లైన్ విధించారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తాను ప్రాణత్యాగం చేసి అయినా కాపులకు రిజర్వేషన్లు సాధించుకుని తీరతానని ప్రకటనలు గుప్పించారు. 2021లో కాపు సంక్షేమ సేన ఏర్పాటు చేసి రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్నామని వివరించారు. కాపు రిజర్వేషన్ల అంశంలో తమకు సహకరించాలని కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలకు ఉత్తరాలు రాశారు. రిజర్వేషన్లు పొందడం తమ హక్కు అని కాపులకు పిలుపునిచ్చారు. కొద్దికాలంగా కాపుజాతి, రిజర్వేషన్ల గురించి ప్రభుత్వాలకు, మంత్రులకు, నేతలకు లేఖలు రాసే హరిరామజోగయ్య అధికారంలో ఉన్న సమయంలో కాపుల గురించి ఏనాడూ పట్టించుకోలేదనే అపవాదు ఉంది.
కాపులు ఎక్కులు ఎక్కువగా ఉన్న నర్సాపురం–పాలకొల్లు ప్రాంతంలో కుటుంబ మూలాలున్న పవన్ కల్యాణ్ కూడా జోగయ్య మాటలను లను పట్టించుకోకపోవడానికి ఇదీ ఒక కారణమని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి కొన్ని రోజులుగా జోగయ్య పవన్పై చాలా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. కాపులు సీఎంగా ఉండాలన్నదే జోగయ్య లక్ష్యం. అప్పుడే వారి కులం ముందుకు వెళ్తుందని ఆయన చెబుతుండేవారు. అదే కాపు కులానికి చెందిన పవన్ కేవలం 24 అసెంబ్లీ స్థానాల్లోనే పోటి చేస్తుండడం జోగయ్యకు నచ్చలేదు. పొత్తులో భాగంగా జనసేన 50-60 స్థానాల్లో పోటి చేయాలని ఆయన అనేకసార్లు సలహా ఇచ్చారు. అయితే జనసేనకు కేవలం 24 సీట్లే కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. ఆయన తీరు అలా ఉంటే.. కుమారుడు సూర్యప్రకాశ్ ఏకంగా జనసేననే వదిలేశారు.
ప్రస్తుతం దాదాపు 86 ఏళ్ళ వయసులో ఉన్న జోగయ్య గతంలో మంత్రిగా, ఎంపీగా కూడా పనిచేశారు. వయసు రీత్యా జోగయ్య ప్రస్తుతం బయట తిరిగే పరిస్థితి లేదు. అలాగే.. ఆయనను ఎవరూ కలవడం లేదు కూడా. కాపు సంఘాలు కానీ కాపు సామాజిక వర్గం లో ప్రముఖలు కానీ ఆయనను కలవడం లేదు. ఆయన సలహాలు కోరుతున్నవారూ తక్కువే. ఎందుకంటే ఈయన ఎవరితోను, ఏ సంస్ధలో కూడా ఇమడలేరని ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడ ఉన్నా తన మాటే నెగ్గాలనే పట్టుదల వల్లే చాలామంది ఈయనకు దూరంగా ఉంటారని ప్రచారంలో ఉంది. అలాంటి జోగయ్య హఠాత్తుగా తెలుగుదేశం పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవాలని పవన్ కు సూచించారు. ఎన్నో సూచనలు చేశారు. అవేమీ పవన్ పట్టించుకోలేదు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నా.. అది పవన్ వ్యక్తిగతమే.
ఇప్పుడు హరిరామ జోగయ్య కుమారుడు వైసీపీలో చేరడం ద్వారా ఆయన కూడా తండ్రి మాట వినే పరిస్థితి లేదన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ప్రభుత్వ చర్యలతో వైసీపీకి కాపు సామాజికవర్గం దూరమైందన్న టాక్ నడుస్తోంది. గత ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్లు రద్దుచేసి.. నాలుగు సంవత్సరాలు రిజర్వేషన్ ఫలాలను దూరం చేసిన జగన్ పై మెజారిటీ కాపు సామాజికవర్గం ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కాపు ఉద్యమ నేత అని చెప్పుకునే హరిరామజోగయ్య కుమారుడు వైసీపీలో చేరారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ