జనవరి 26న 75వ గణతంత్ర దినోత్సవాలను జరుపుకోవడానికి యావత్ భారత దేశం సిద్ధం అవుతోంది. 1950లో ఇండియా గణతంత్ర దేశంగా అవతరించింది. ఢిల్లీలోని కర్తవ్య పథ్ కేంద్రంగానే ప్రతీ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతాయి. గతంలో రాజ్పథ్ అని పిలిచే ఈ ప్రాంతంలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్ అందరినీ ఆకట్టుకుంటుంది.
రిపబ్లిక్ డే పరేడ్లో సాయుధ బలగాలకు చెందిన మూడు శాఖల బృందాలు చేసే కవాతుతో పాటు.. ఆయుధాలు, సైనిక పరికరాల ప్రదర్శనలు, మోటార్ సైకిల్ విన్యాసాలు భారతదేశ సైనిక సత్తాను నలుమూలలా చాటుతాయి. అయితే ఈ ఏడాది భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ను ప్రభుత్వం ఆహ్వానం పంపింది.
కర్తవ్య పథ్ ( రాజ్ ఫథ్) రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు విస్తరించి ఉంది. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంతో కర్తవ్య పథ్కు విడదీయరాని అనుబంధం ఉందని చరిత్రకారులు చెబుతారు. బ్రిటిష్ సర్కారు 1911లో తన రాజధానిని కోల్కతా నుంచి ఢిల్లీకి మార్చిన తర్వాత ఈ రహదారిని నిర్మించారు. దానికి ‘కింగ్స్వే’ అనే పేరు పెట్టింది. అయితే ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే ఈ రహదారిని ‘రాజ్పథ్’గా మార్చారు. ఆ తరువాత దీనినే ‘కర్తవ్య పథ్’ అనే పేరుతో పిలుస్తున్నారు.
ఏడు దశాబ్దాలుగా వార్షిక గణతంత్ర దినోత్సవ వేడుకలను కేంద్ర ప్రభుత్వం ‘కర్తవ్య పథ్’లోనే నిర్వహిస్తూ వస్తుంది. ఈ మార్గం వలస పాలన నుంచి ప్రజాస్వామ్య గణతంత్రం వరకు సాగిన భారతదేశపు ప్రయాణానికి చిహ్నంగా నిలిచింది. 2022లో ‘రాజ్పథ్‘ను ‘కర్తవ్య పథ్’గా మార్చారు. తర్వాత దీనికి సెంట్రల్ విస్టా అవెన్యూలో చేర్చారు.
ఒకప్పుడు ‘రాజ్పథ్’ కేవలం అధికార చిహ్నంగానే ఉండేది. దానిని ‘కర్తవ్య పథ్’గా మార్చాక ఈ మార్గం సాధికారతకు చిహ్నంగా మారింది. ‘కర్తవ్య పథ్’ ప్రారంభోత్సవాన ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. నాటి ‘కింగ్స్వే’ లేదా ‘రాజ్పథ్’ బానిసత్వానికి చిహ్నంగా నిలిచిందని, ఇటువంటి గుర్తింపును పూర్తిగా తుడిచివేయడానికే దీనికి ‘కర్తవ్య పథ్’ అనే పేరు పెట్టినట్లు చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ