తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 49వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లాలో కొనసాగుతోంది. ఈ క్రమంలో మంగళవారం కదిరి టౌన్ శివారు ప్రాంతంలో టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. నాడు టీడీపీ ప్రభుత్వ హయాంలో 90 శాతం పూర్తయిన ఇళ్లను వైసీపీ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా పూర్తి చేయలేదని, కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని విమర్శించారు. లబ్దిదారుల ఎంపిక లోనూ అన్యాయం చేశారని, టీడీపీ హయాంలో ఉన్న లబ్దిదారులను తొలగించి వైసీపీ నాయకులు, కార్యకర్తలకు ఇళ్లు కేటాయించారని ఆరోపించారు. పేదవారి సొంతింటి కలను నెరవేర్చాలనే సంకల్పంతో చంద్రబాబు ప్రభుత్వం టిడ్కో నేతృత్వంలో జీప్లస్ త్రీ తరహాలో మూడు రకాలు ఇళ్లు నిర్మించిందని, వీటిలో.. 300, 365, 430 చదరపు అడుగులతో పూర్తిగా షేర్వార్న్-టెక్నాలజీని ఉపయోగించి ఇళ్లను నిర్మించిందని తెలిపారు.
300 చదరపు అడుగుల (సింగిల్ బెడ్ రూమ్) ఇంటికి రూ.500లు లబ్దిదారులు వాటా కాగా.. ఇది పూర్తిగా ఉచితమని, 365 చదరపు అడుగుల నివాసానికి లబ్దిదారుని వాటా రూ.50000/- (సింగిల్ బెడ్ రూమ్) అని లోకేష్ వివరించారు. అలాగే 430 చదరపు అడుగుల నివాసానికి లబ్దిదారుని వాటా రూ.లక్ష ఉండగా, మిగిలిన దానికి బ్యాంకు లోన్ గత ప్రభుత్వమే మంజూరు చేయించిందని (డబుల్ బెడ్రూమ్ ఇళ్లు) తెలిపారు. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా టిడ్కో ఇళ్లు ఇస్తామని జగన్ హామీ ఇచ్చి మోసం చేశారని, రాష్ట్ర వ్యాప్తంగా 90 శాతం నిర్మించిన ఇళ్లను పూర్తి చేసి ఇవ్వకుండా అనేక నిబంధనలు పెట్టి లబ్ది దారులను ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. తక్షణమే మిగిలిన ఇళ్ల పనులు పూర్తి చేయాలని, ఉచితంగా ఇళ్లు కేటాయిస్తామని ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకోవాలని నారా లోకేష్ సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE