టీడీపీ యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం యాత్ర 33వ రోజున లోకేష్ పుంగనూరులో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పుంగనూరులో పెద్దాయన అని పిలవాలని చెప్తున్నారని, దేనికి ఆయనను అలా పిలవాలని అడిగారు. ఇక్కడ భూములు దోచుకున్నందుకు పెద్దాయన అని పిలవాలా? మట్టి మాఫియా, ఇసుక దోపిడీ చేసిన దానికి పెద్దాయన అని పిలవాలా? అని ప్రశ్నించారు. బయట పాల డైరీలు ఇచ్చే ధర కంటే ఆరు రూపాయలు ఇప్పటికీ తక్కువ ఇస్తూ పాడి రైతులను దోచేస్తున్నారని మండిపడ్డారు.
సీఎం జగన్ ఏపీలోకి అమూల్ డైరీని తీసుకొచ్చారని, రాష్ట్రమంతా అన్ని ప్రాంతాల్లో ఆ డైరీ కార్యకలాపాలు సాగిస్తుందని నారా లోకేష్ తెలిపారు. అయితే ఆశ్చర్యకరంగా పుంగనూరులో మాత్రం అమూల్ డైరీ లేదని, మంత్రి పెద్దిరెడ్డికి చెందిన శివశక్తి డైరీ కోసం అమూల్ సంస్థను పుంగనూరుకు తీసుకురాలేదని విమర్శించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు కొందరు అమాయకుల భూముల మీద కన్నేసి భూములు కొట్టేస్తున్నారని, రూ.500 రూపాయలు విలువైన అటవీశాఖ భూమిని ఇప్పటికే కబ్జా చేశారని చెప్పారు. ఇక జిల్లాలో రిజర్వాయర్ కోసం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని, ఇంతవరకు వారికి నష్టపరిహారం చెల్లించలేదని తెలిపారు. ప్రజలను దోచుకుంటున్న పెద్దిరెడ్డిని వచ్చే ఎన్నికల్లో పుంగనూరు నుంచి శాశ్వతంగా ఇంటికి పంపుతామని, తగ్గేది లేదని, ఏం చేస్తారో చేసుకోండి అని లోకేష్ మంత్రికి సవాల్ విసిరారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మదనపల్లి జిల్లా ఏర్పాటు చేస్తామని, పుంగునూరు, పీలేరును మదనపల్లి జిల్లాలో కలుపుతామని నారా లోకేష్ తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE