ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకు ట్విట్టర్ వేదికగా ఈ రోజు ఒక విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో మే 20 తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఏ వేడుకలు చేయవద్దని, ఇది వేడుకలు చేసుకునే సమయం కాదు అని ఎన్టీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
“నా అభిమానులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గత కొద్ది రోజులుగా మీరు పంపుతున్న సందేశాలు, వీడియోలు చూస్తున్నాను. మీ ఆశీస్సులు నాకెంతో ఊరట కలిగించాయి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ప్రస్తుతం నేను బాగున్నాను. త్వరలో పూర్తి గా కోలుకుని, కోవిడ్ ను జయిస్తాను అని ఆశిస్తున్నాను. ప్రతి ఏటా మీరు నా పుట్టిన రోజున చూపే ప్రేమ, చేసే కార్యక్రమాలు ఒక ఆశీర్వచనంగా భావిస్తాను. కానీ ఈ సంవత్సరం మీరు ఇంటి పట్టునే ఉంటూ, లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ నియమాలను పాటిస్తూ జాగ్రత్త గా ఉంటారని ఆశిస్తున్నాను. ఇదే మీరు నాకు అందించే అతి పెద్ద కానుక. ఇది వేడుకలు చేసుకునే సమయం కాదు. మన దేశం కరోనాతో యుద్ధం చేస్తోంది. కనిపించని శత్రువుతో అలుపెరుగని పోరాటం చేస్తున్న మన డాక్టర్లు, నర్సులు మరియు ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్ కు మన సంఘీభావం తెలపాలి. ఎందరో తమ ప్రాణాలను, జీవనోపాధిని కోల్పోయారు. ఆ కుటుంబాలకు కుదిరితే అండగా నిలబడాలి. మీ కుటుంబాన్ని జాగ్రత్త గా చూసుకోండి. మీరు జాగ్రత్త గా ఉండండి. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ, చేతనైన ఉపకారం చేయండి. త్వరలో మన దేశం ఈ కరోనాను జయిస్తుంది అని నమ్ముతున్నాను. ఆ రోజున అందరం కలిసి వేడుక చేసుకుందాం. అప్పటి వరకు, మాస్క్ ధరించండి. జాగ్రత్త గా ఉండండి. నా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తున్నాను” అని ఎన్టీఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ