టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు ఏప్రిల్ 20న కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యం పాలైన ఆయన ఈ తెల్లవారుజామున చెన్నైలో తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యానికి గురైన ఆయనను కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి 12 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం తాతినేని రామారావుకు 83 సంవత్సరాలు. కాగా రామారావు మృతి వార్తను ఆయన కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. రామారావు అంత్యక్రియలు ఈరోజు (ఏప్రిల్ 20) సాయంత్రం చెన్నైలో నిర్వహిస్తామని వారు ప్రకటించారు. తాతినేని రామారావు 1938లో కృష్ణా జిల్లా కపిలేశ్వరపురంలో జన్మించారు. సినిమాలపై ఆసక్తితో మద్రాసులో అడుగు పెట్టిన ఆయన ప్రముఖ స్టూడియోలలో పనిచేశారు.
తాతినేని రామారావు తెలుగులోనే కాకుండా దేశంలోని పలు భాషలలోని అగ్రస్థాయి నటులతో పనిచేశారు. ఎన్టీఆర్, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ వంటి సూపర్ స్టార్లతో సినిమాలు తీశారు.టి.రామారావుగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. హిందీలో సూపర్ హిట్ అయిన పలు సినిమాలను తెలుగులో రీమేక్ చేసి విజయం సాధించేవారు. దర్శకుడిగా ఆయన పనిచేసిన సినిమాల్లో చాలావరకు రీమేక్లు ఉండటం గమనార్హం. 1966 నుంచి 2000 వరకు తెలుగు, హిందీ భాషల్లో 70కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. అందుకే అందరూ ఆయనను ఆ రోజుల్లో `తెలుగు వారి హిందీ దర్శకుడు` అని పిలిచేవారు. ‘నవరాత్రి’ సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన తాతినేని రామారావు.. ఆ తర్వాత తెలుగు అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్తో ‘యమగోల’ సినిమా తీసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా తాతినేని రామారావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ