కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శనివారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 44వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కోవిడ్-19 చికిత్సలో భాగంగా ఉపయోగిస్తున్న ఔషధాలు, వైద్య పరికరాలు సహా ఇతర సామగ్రి, వస్తువులపై జీఎస్టీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఉపయోగించే ఔషధంపై కూడా జీఎస్టీ శాతాన్ని తగ్గించారు. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కరోనా చికిత్సలో ఉపయోగించే టొసిలిజుమాబ్, బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఉపయోగించే ఆంఫోటెరిసిన్-బిపై ఉన్న 5 శాతం జీఎస్టీని పూర్తిగా రద్దు చేశారు. రెమ్డెసివిర్ మరియు కరోనా చికిత్స కోసం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, ఫార్మా డిపార్ట్మెంట్ సూచించిన ఔషధాలపై 12 శాతం జీఎస్టీని 5 శాతంకు తగ్గించారు. ఇక మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు/జనరేటర్లు, వెంటిలేటర్లు, వెంటిలేటర్ మాస్క్స్/క్యానులా/హెల్మెట్స్, బైపాప్ యంత్రం, హైఫ్లో నాసల్ క్యానులా యంత్రాలు, కరోనా టెస్టింట్ కిట్లు, డి-డైమర్, ఐఎల్-6, ఫెర్రిటిన్ అండ్ ఎల్డీహెచ్ వంటి స్పెసిఫైడ్ ఇన్ఫ్లమేటరీ డయాగ్నోస్టిక్ కిట్లు, పల్స్ ఆక్సిమీటర్లుపై 12 శాతం జీఎస్టీని నుంచి 5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా హ్యాండ్ శానిటైజేర్స్, ఉష్ణోగ్రత తనిఖీ పరికరాలు, శ్మశానవాటిక కోసం గ్యాస్/ఎలక్ట్రిక్/ఇతర ఫర్నేసులు, వాటి ఇన్స్టాలేషన్ పై 18 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు. మరోవైపు అంబులెన్స్ లపై కూడా 28 శాతం జీఎస్టీని 12 శాతానికి తగ్గించారు. కాగా కొత్తగా నిర్ణయించిన ఈ జీఎస్టీ రేట్లు సెప్టెంబరు 30, 2021 వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ