ఇండియా-చైనా మధ్య ఉద్రిక్తత అనేది ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. కానీ మధ్యలో సత్సంబంధాలు కొనసాగించడానికే ఆ దేశం మొగ్గు చూపించినట్లే కనిపించింది. అయితే కొన్నేళ్లుగా సరిహద్దులో చైనా ప్రవర్తిస్తున్న తీరు..అటు బోర్డర్లో ఉన్న సైనికులకు, భారతీయులకు కాస్త ఆందోళనకరంగా మారింది.
ఒక్క భారత దేశం విషయం అనే కాదు..తమ దేశపు సమాచారాన్ని ప్రపంచానికి చేరకుండా దాచి పెడుతుందనే పేరు చైనాకు ఉంది. ఇక చైనా దేశ భద్రతకు సంబంధించినది అయితే మాత్రం.. పొరపాటున కూడా ఆ సమాచారం బయటకు పొక్కకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. అందులోనూ భారతదేశానికి తమ భద్రత విషయాలు అసలేమాత్రం తెలియకూడదని అనుకుంటోంది.
ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ..అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ పెంటగాన్ తాజాగా చైనా సైన్యంపై తన వార్షిక నివేదికను రిలీజ్ చేసింది. చైనా దేశపు సైన్యం వద్ద ఉన్న అణు బాంబులు ఎన్ని? ఎన్ని విదేశీ స్థావరాల నుంచి డ్రాగన్ కంట్రీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది వంటి చైనా సైన్యం సమాచారాన్ని మొత్తం తమ నివేదికలో పొందుపరిచింది. ముఖ్యంగా చైనా దేశపు జాతీయ భద్రతకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని ఈ నివేదికలో అందించింది. ఇందులో ఆ దేశానికి చెందిన ప్రతి ఆయుధం గురించి కూడా సమాచారాన్ని అందించింది. అయితే మిగిలిన దేశాల కంటే కూడా భారత దేశానికే ఎక్కువ ముఖ్యమయినదిగా రాయిటర్స్ భావిస్తోంది.
చైనా వద్ద ఉన్న అణ్వాయుధాలు గురించి చెప్పిన అమెరికా.. చైనా దేశం వద్ద ప్రస్తుతం 500 ఆపరేషనల్ న్యూక్లియర్ బాంబులు ఉన్నట్లు చెప్పింది. 2030 నాటికి ఆ అణ్వాయుధాల నిల్వ దాదాపు 1000కి పెరుగుతున్నట్లు అమెరికా అంచనా వేసింది. అలాగే 2021లో చైనా అణుబాంబుల సంఖ్య 400 అని చెప్పిన అమెరికా.. అణుబాంబుల సంఖ్య పరంగా ప్రపంచంలో చైనా మూడవ స్థానంలో ఉన్నట్లు గుర్తు చేసింది.
అలాగే చైనా 2022లోనే మూడు కొత్త సైలో ఫీల్డ్ల నిర్మాణాన్ని పూర్తి చేసింది.దీంతో చైనాలో 300 ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్స్ ఉన్నట్లు అమెరికా తేల్చింది. చైనాలో సిలో అనేది క్షిపణులను నిల్వ చేసే ప్రదేశం అని.. అందులోనే చైనా కూడా సంప్రదాయ ఖండాంతర క్షిపణి వ్యవస్థను సిద్ధం చేస్తోందని అమెరికా తెలిపింది.
మరోవైపు చైనా విదేశీ సైనిక స్థావరాన్ని కూడా పెంచుకుంటూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తన సైనిక ఉనికిని పెంచుకుంటోన్న చైనా.. మయన్మార్, థాయిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా, నమీబియా, మొజాంబిక్, కెన్యా, నైజీరియా, బంగ్లాదేశ్, సోలమన్ దీవులు, తజికిస్థాన్లలో తన సైనిక స్థావరాలను మెల్లగా సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తోంది.
అంతేకాదు చైనా దేశం ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాదళాన్ని కలిగి ఉన్న దేశంగా గుర్తించబడింది. ఈ నౌకాదళాన్ని కూడా చైనా ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందేలా చేస్తుంది. చైనాలో ప్రస్తుతానికి నౌకాదళంలో 370 నౌకలు, జలాంతర్గాములు ఉన్నట్లు రిపోర్టు తెలియజేసింది. గతేడాది ఆ నౌకలు, జలాంతర్గాముల సంఖ్య 340గా ఉండేది. అలాగే 2025 నాటికి చైనా నౌకాదళం సంఖ్యను.. 395 నౌకలకు, 2030 నాటికి 435 నౌకలకు చేరుకునేలా చైనా ప్రయత్నిస్తోంది.
అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ పెంటగాన్ తాజాగా చైనా సైన్యంపై రిలీజ్ చేసిన వార్షిక నివేదిక.. భారతదేశానికి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ నివేదిక ఆధారంగా బీజింగ్తో వ్యవహరించడానికి వీలుగా తన వ్యూహాన్ని సిద్ధం చేసుకోవచ్చు. అంతేకాదు ఆయుధాల సంఖ్యను బట్టి భారతదేశం..ఇప్పుడు ఏ దిశలో ఎక్కువగా పని చేయాలో అనేది అంచనా వేయడానికి అవకాశం వచ్చినట్లు అయింది. ఇప్పుడు అమెరికా అందించిన ఆ సమాచారంతో భారత్ సరిహద్దుల్లో సైనికులు, ఆయుధాల ఉనికిని పెంచడానికి పనకొస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE