ఎలక్టోరల్ బాండ్లపై సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని.. వాటిని రద్దు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం క్విడ్ ప్రో కోకు దారితీస్తుందని వ్యాఖ్యానించింది.ఈ మేరకు ఎలక్టోరల్ బాండ్ల జారీని నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే సుప్రీం తీర్పుతో దేశవ్యాప్తంగా ఎలక్టోరల్ బాండ్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు ఎలక్టోరల్ బాండ్లు అంటే ఏమిటి? అవి ఎలా పనిచేస్తాయి? అనే దాని గురించి జనాలు చర్చించుకుంటున్నారు.
2017-2018 బడ్జెట్లో కేంద్రంలోని బీజేపీ సర్కార్ మొదటిసారి ఈ ఎలక్టోరల్ బాండ్లను ప్రవేశపెట్టింది. ఎలక్టోరల్ బాండ్ అంటే కరెన్సీ నోటులా రాయబడిన ఒక ప్రామిసరీ నోటు. ఈ ఎలక్టోర్ బాండ్ల ద్వారా వ్యాపారస్థులు, సామాన్య వ్యక్తులు, సంస్థలు రాజకీయ పార్టీలకు విరాళాలు అందించేందుకు అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ ఎలక్టోరల్ బాండ్లు లభిస్తాయి. వాటిని కొనుగోలు చేసి రాజకీయ పార్టీలకు విరాళంగా అందివ్వొచ్చు. కేవలం కేవైసీ వెరిఫికేషన్ పూర్తయిన ఖాతాదారులు మాత్రమే ఈ బాండ్లను కొనుగోలు చేసేందుకు వీలు ఉంటుంది.
అలాగే ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన సదరు కంపెనీ లేదా వ్యక్తులు 15 రోజుల్లోపు తమకు నచ్చిన పార్టీకి విరాళంగా అందివ్వాల్సి ఉంటుంది. అలా విరాళంగా పొందిన బాండ్లను సదరు రాజకీయ పార్టీలు తిరిగి బ్యాంకులో జమ చేసి డబ్బును పొందుతాయి. ఆ డబ్బులను పార్టీలు ఖర్చుల కోసం వినియోగించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎలక్టోరల్ బాండ్లను ప్రతి ఏడాది జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ మొదటి 10 రోజుల్లో మాత్రమే కొనుగోలు చేసేందుకు వీలు ఉంటుంది. రాజకీయ పార్టీల విరాళాల విషయంలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ ఎలక్టోరల్ బాండ్లను తీసుకొచ్చింది.
అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. దాళల వివరాలను ఎలక్టోరల్ బాండ్లపై ముద్రించకుండా ఎస్బీఐ గోప్యంగా ఉంచుతుంది. ఈక్రమంలో కొన్ని కంపెనీలు, వ్యక్తులు పెద్ద ఎత్తున బాండ్లను కొనుగోలు చేసి తమకు నచ్చిన రాజకీయ పార్టీలకు అందిస్తున్నారు. ఆ తర్వాత సదరు పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పరంగా సదరు కంపెనీ లేదా వ్యక్తులు లబ్ధిపొందుతున్నారు. ఇది క్విడ్ ప్రోకోకు దారి తీసే అవకాశం ఉండడంతో కొందరు వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేయాలని పిటీషన్ దాఖలు చేశారు. అటు ప్రతిపక్షాలు కూడా అధికార పార్టీ లబ్ధిపొందేలా ఈ పథకం ఉందని ఆరోపిస్తున్నాయి. తాజాగా ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఎలక్టోరల్ బాండ్ల జారీని నిలిపివేయాలని ఆదేశించింది. అయితే సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా లబ్ధిపొందే రాజకీయ పార్టీలకు ఇబ్బందికరంగా మారడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY