ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 నిర్వహణ విషయంలో భారత్ క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో పలు జట్ల ఆటగాళ్లు కరోనా వైరస్ బారిన పడడంతో ఐపీఎల్-2021 ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ సీజన్ లో మిగిలిన ఐపీఎల్ మ్యాచ్లను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లుగా బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మంగళవారం నాడు ప్రకటించారు. అలాగే ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ స్పందిస్తూ ప్రస్తుతం ఐపీఎల్-2021 ను సస్పెండ్ చేసాము. కొత్త విండో పై ఆలోచిస్తాం. త్వరలో ఒక ప్రకటన వస్తుందని తెలిపారు.
ముందుగా కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అనంతరం చెన్నై బౌలింగ్ కోచ్ బాలాజీకి, సిబ్బందికి, అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అమిత్ మిశ్రా కూడా కరోనాబారిన పడ్డారు. బయో బబుల్లో పలు నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ ఇలా పలు జట్ల ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ గా తేలడంతో మ్యాచుల నిర్వహణపై సందిగ్థత ఏర్పడింది. ఇప్పటికే సోమవారం రాత్రి 7:30 గంటలకు అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో కోల్కతా నైట్రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ను రీషెడ్యూలు చేశారు. ఈ క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ (ఐపీఎల్ జీసీ), బీసీసీఐ అత్యవసర సమావేశం నిర్వహించి ఐపీఎల్-2021 సీజన్ వాయిదాను వెంటనే అమలులోకి తీసుకురావాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ