తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పదేళ్ల తరవాత తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్ నేతృత్వంలో ఆ పార్టీ అధికారం చేప్పట్టబోతోంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా మే 7వ తేదీన స్టాలిన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా సీఎం పీఠం దక్కించుకునేందుకు 118 సీట్లు కావాల్సి ఉంది. డీఎంకే కూటమి 156 స్థానాల్లో విజయసాధించడంతో పూర్తి మెజార్టీతో స్టాలిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.
అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా రాజ్ భవన్ లో ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించినట్లుగా స్టాలిన్ వెల్లడించారు. అతి కొద్దిమంది సమక్షంలో సీఎంగా ప్రమాణం చేయనున్నట్టు తెలిపారు. అలాగే డీఎంకే 10 ఇయర్స్ విజన్ డాక్యుమెంట్ సహా తన పార్టీ ఎన్నికల వాగ్దానాలను దశలవారీగా అమలు చేయడానికి తక్షణ ప్రయత్నాలు చేస్తామని స్టాలిన్ స్పష్టం చేశారు. మరోవైపు అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి సీఎం పదవి నుంచి సోమవారం నాడు తప్పుకున్నారు. తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ కు అందజేశారు. అలాగే పార్టీ ఎమ్మెల్యేలు ఆయన్ను అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. పది సంవత్సరాల పాటుగా అధికారంలో అన్నాడీఎంకే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకోలేకపోయింది. అన్నాడీఎంకే కూటమి ఈ ఎన్నికల్లో 74 స్థానాలు మాత్రమే దక్కించుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ