కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సుదీర్ఘ పాదయాత్ర ‘భారత్ జోడో యాత్ర’ ప్రస్తుతం మధ్యప్రదేశ్లో జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం పాదయాత్ర ఉజ్జయినిలో కొనసాగుతున్న క్రమంలో ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్ మరియు నటి స్వర భాస్కర్ పాల్గొన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ రాహుల్ గాంధీతో కలిసి వీరి చిత్రాలను షేర్ చేసింది. మధ్యప్రదేశ్లోని రాజకీయంగా కీలకమైన మాల్వా-నిమార్ ప్రాంతంలో 380 కిలోమీటర్ల మేర సాగిన యాత్ర పూర్తవనుంది.
ఇక రాహుల్ గాంధీ నేతృత్వంలోని పాదయాత్ర నవంబర్ 23న మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ జిల్లాలోకి ప్రవేశించింది. ఇది ఇప్పటివరకు ఎంపీలోని బుర్హాన్పూర్, ఖాండ్వా, ఖర్గోన్ మరియు ఇండోర్ జిల్లాల మీదుగా సాగింది. ఇక డిసెంబర్ 4న యాత్ర మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్లోకి ప్రవేశించనుంది. కాగా అమోల్ పాలేకర్, సంధ్యా గోఖలే, పూజా భట్, రియా సేన్, మోనా అంబేగావ్కర్, రష్మీ దేశాయ్, ఆకాంక్ష పూరి వంటి పలువురు సినీ ప్రముఖులు జోడో యాత్రలో పాల్గొన్నారు. అలాగే హాలీవుడ్ స్టార్ జాన్ కుసాక్ కూడా ట్విట్టర్లో తన మద్దతుని ప్రకటించడం విశేషం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE