గుజరాత్ రాష్ట్రంలోని మోర్బీ పట్టణంలో ఆదివారం సాయంత్రం మచ్చూ నదిపై ఉన్న సస్పెన్షన్ బ్రిడ్జి కూలడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 132 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురికి తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ “మోర్బీలో జరిగిన దుర్ఘటన పట్ల నేను చాలా బాధపడ్డాను. దీనికి సంబంధించి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఇతర అధికారులతో మాట్లాడాను. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి మరియు బాధితులకు అవసరమైన అన్ని సహాయాలు అందిస్తున్నారు” అని పేర్కొన్నారు.
అలాగే సోమవారం ఉదయం గుజరాత్ లోని కెవాడియాలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, మోర్బీలో బ్రిడ్జి కూలిన ఘటన తనను తీవ్రంగా బాధించిందని అన్నారు. విధి నిర్వహణలో భాగంగా తాను ప్రజల మధ్యలో ఉన్నాను కానీ తన మనసు మాత్రం బాధిత కుటుంబాలపైనే ఉందని అన్నారు. విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గుజరాత్ ప్రభుత్వం వారితో ఉందని, రాష్ట్ర ప్రభుత్వం తన పూర్తి శక్తి మేర సహాయక చర్యలు చేపడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మరోవైపు మోర్బీలో జరిగిన దుర్ఘటనలో మృతులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుండి ప్రధాని మోదీ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి పీఎంఎన్ఆర్ఎఫ్ నుండి రూ.2 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రధాని మోదీ ప్రకటించారని, గాయపడిన వారికి రూ.50,000 ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. అలాగే సీఎం భూపేంద్ర పటేల్ నేతృత్వంలో గుజరాత్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు ఎక్స్గ్రేషియా మరియు గాయపడిన వారికీ రూ.50 వేల చొప్పున అందించనున్నట్టు ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE