భారత్ లో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 29,100 పాజిటివ్ కేసులు నమోదవగా వీరిలో 6,564 మంది కోలుకున్నారు, 1068 మంది మృతిచెందారు. అలాగే రాష్ట్రంలో 1,100 మందికి పైగా పోలీసు సిబ్బందికి కూడా కరోనా వైరస్ సోకినట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలో రోజురోజుకి కరోనా తీవ్రత పెరిగిపోతుండడంతో ముంబయి లోని ఆస్పత్రులన్నీ కరోనా బాధితులతో ఇప్పటికే నిండిపోయాయి.
ఈ నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ముంబయిలోని చారిత్రాత్మక క్రికెట్ స్టేడియమైన వాంఖడే స్టేడియాన్ని క్వారెంటైన్ కేంద్రంగా మార్చాలని నిర్ణయించింది. కరోనా బాధితుల కోసం వెంటనే ఈ స్టేడియాన్ని తమకు అప్పగించాలని బీఎంసీ కోరింది. ఈ మేరకు ముంబయి క్రికెట్ అసోషియేషన్ (ఎంసీఏ)కు ఓ లేఖ రాసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల దృష్ట్యా బాధితులకు చికిత్స కోసం వాంఖడే స్టేడియాన్ని అప్పగించాలని బీఎంసీ అసిస్టెంట్ కమిషనర్ చంద ఆర్. జాదవ్ కోరారు. దీనిపై ఎంసీఏ కార్యదర్శి సంజయ్ నాయక్ మాట్లాడుతూ క్రికెట్ సంఘం బీఎంసీ అధికారులతో సహకరిస్తుందని చెప్పారు. అసిస్టెంట్ కమిషనర్ నుండి ఈ విషయంపై మరిన్ని సూచనల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu