పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ గురువారం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ ను, కొండపోచమ్మ పంప్ హౌస్ ను, ఎర్రవల్లిలోని చెక్ డాంను చివరిగా గజ్వేల్ పట్నంలోని పాండవుల చెరువును సందర్శించి తిలకించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రత్యేకతలు మరియు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రాధాన్యత, దాని నిర్మాణం, నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధను వివరించారు. అనంతరం పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆహ్వానం మేరకు నాలెడ్జ్ షేరింగ్ లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకంను పరిశీలించేందుకు రాష్ట్రానికి రావడం జరిగిందన్నారు. 500 మీటర్ల పైకి గోదావరి నీటిని కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా తీసుకువచ్చి మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేయడం ఆదర్శనీయమన్నారు.
తెలంగాణ నీటిపారుదల మోడల్ దేశానికి ఆదర్శం:
“సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగంతో పాటు నీటిపారుదల, పారిశ్రామిక, వైద్య, ఆరోగ్యం తదితర అన్ని రంగాలలో అద్భుతమైన అభివృద్ధి జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన రిజర్వాయర్లు, చెక్ డాములు భూగర్భ జలాల పెంపునకు అత్యధికంగా ఉపయోగపడుతుంది. తెలంగాణ నీటిపారుదల మోడల్ దేశానికి ఆదర్శం. 1947 ముందే నుండి పంజాబ్ రాష్ట్రంలో నీటిపారుదల మరియు వ్యవసాయ రంగాలు అభివృద్ధి సాధించాయి. పంజాబ్ అంటేనే ఐదు నదుల సంగమము. భాక్రానంగల్ లాంటి గొప్ప ప్రాజెక్టులతో పంజాబ్ దేశంలోనే ఆహార ఉత్పత్తిలో ప్రథమంగా ఉండేది. కానీ భూగర్భ నీటి వనరులను అధికంగా ఉపయోగించడం మూలంగా ప్రస్తుతం పంజాబ్ లోని కొన్ని జిల్లాలో భూగర్భ నీటిమట్టాలు ప్రమాదకర స్థాయికి చేరాయి. పంజాబ్ లో 80% భూగర్భ నీటి లభ్యతలో డార్క్ జోన్ లో ఉంది. తెలంగాణ మోడల్ ని అనుసరించి పంజాబ్ లో కూడా చెక్ డాములు విరివిగా నిర్మించి జల సంపదను భవిష్యత్తు తరాలకు అందించేందుకు చర్యలు చేపడతాము. భూగర్భ నీటి వనరులను కాపాడేందుకు క్రాఫ్ట్ డైవర్షన్ పద్ధతిని అనుసరిస్తున్నాము” అని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు.
“పంజాబ్ లో గల పాతకాలం నాటి నీటిపారుదల వ్యవస్థను తెలంగాణలో లాగా ఆధునికరించి భూగర్భ జలాలను పెంచేందుకు ప్రయత్నిస్తాము. పంజాబ్ రాష్ట్రంలో మార్చ్ నెలలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నాము. ఈ బడ్జెట్లో నీటిపారుదల, మరియు పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇవ్వనున్నాము. పంజాబ్ రాష్ట్రం వ్యవసాయ రంగంతో పాటు, పంజాబ్ యువత దేశ రక్షణలో అధిక భాగస్వామ్యం ఉంది. ప్రపంచంలో 80 శాతం శాతం బాస్మతి రైస్ పంజాబ్ లోనే పండుతుంది. గత ప్రభుత్వాల వలన నిర్లక్ష్యానికి గురైన పంజాబ్ ను మళ్లీ ప్రాచీన కాలం నాటి పంజాబ్ గా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. కేంద్ర ప్రభుత్వం సరైన మద్దతు ధర ఇవ్వకపోవడం మూలంగా రైతులు నష్టపోతున్నారు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణలో సీఎం కేసీఆర్ లు విద్యా, వైద్యం తదితర రంగాలలో అమలు చేస్తున్న వినూత్న పథకాలు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆకర్షిస్తున్నాయి” అని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE