దేశంలో కొన్ని రోజులుగా పలుచోట్ల మళ్ళీ కరోనా కేసులు, వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కేసులు ఎక్కువగా నమోదవుతున్న తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. ఈ మేరకు కోవిడ్ -19 కేసులు పెరుగుతున్నందున, కఠినమైన నిఘా ఉంచాలని మరియు వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని.. తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, గుజరాత్ మరియు మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం లేఖ రాసింది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ పేరిట రాసిన లేఖలో.. ఆయా రాష్ట్రాలలో పరీక్షల సంఖ్యను పెంచాలని, కొత్త కోవిడ్ -19 కేసులు, హెచ్3ఎన్2 ఇన్ఫ్లుయెంజా లాంటి వైరల్ ఇన్ఫెక్షన్లు మరియు తీవ్రమైన శ్వాసకోశ సంక్రమణను పర్యవేక్షించాలని ఆదేశించింది.
అలాగే క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ వైరస్ కట్టడికి చర్యలు చేపట్టాలని, ఆయా ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ పైనా దృష్టి పెట్టాలని సూచించింది. అయితే దేశవ్యాప్తంగా గత కొన్ని నెలలుగా కోవిడ్-19 కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టిందని కేంద్ర లేఖలో తెలిపింది. ఇన్ఫ్లుయెంజాతో పాటు కోవిడ్ ప్రభావాన్ని పర్యవేక్షిస్తూ టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్ వ్యూహాన్ని అమలు చేయాలని, అలాగే అంతర్జాతీయ ప్రయాణికులతో పాటు వైరస్ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో నమూనాలను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టాలని సూచించారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 450కి పైగా హెచ్3ఎన్2 వైరస్ కేసులు నమోదు కాగా, దీని కారణంగా పలు రాష్ట్రాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE