దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ కు మొదటి, రెండవ డోసు కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి కేంద్రప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. మార్చి 1 వ తేదీ నుండి 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలిక వ్యాధులుతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడినవారికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేపట్టనున్నట్టు కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్ వెల్లడించారు. ఈ రోజు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దేశంలో మార్చి 1 నుంచి 10,000 ప్రభుత్వ కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వబడుతుందని చెప్పారు.
అలాగే మరో 20,000 ప్రైవేట్ కేంద్రాలలో కూడా వ్యాక్సిన్ అందించబడుతుందని, అయితే ప్రైవేట్ ఆస్పత్రుల నుండి వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే వారు ధర చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ప్రైవేట్ కేంద్రాల్లో వ్యాక్సిన్ కోసం చెల్లించాల్సిన మొత్తాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 3-4 రోజుల్లో నిర్ణయిస్తుందని, ప్రస్తుతం వ్యాక్సిన్ తయారీదారులు మరియు ఆసుపత్రులతో చర్చలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్ తెలిపారు.
మరోవైపు ఫిబ్రవరి 24, బుధవారం ఉదయం 7 గంటల వరకు దేశంలో లబ్ధిదారులకు అందించిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య కోటి 21 లక్షలు (1,21,65,598) దాటింది. ఇందులో 64,98,300 హెల్త్ కేర్ వర్కర్స్(మొదటి డోస్), 13,98,400 హెల్త్ కేర్ వర్కర్స్(సెకండ్ డోస్), 42,68,898 మంది ఫ్రంట్లైన్ వర్కర్స్ (మొదటి డోస్) వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ