ఇంగ్లాండ్ లోని బర్మింగ్హామ్ వేదికగా జూలై 28న కామన్ వెల్త్ గేమ్స్-2022 ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. నేటి (జూలై 29, శుక్రవారం) నుంచి క్రీడా సమరం మొదలుకానుంది. ఈ నేపథ్యంలో కామన్ వెల్త్ గేమ్స్-2022 లో పాల్గొంటున్న భారత్ బృందానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వారు ట్వీట్ చేశారు. “తోటి పౌరులందరి తరపున, కామన్ వెల్త్ గేమ్స్ 2022 కోసం భారత బృందానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన అథ్లెట్లు తమ అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచి దేశం గర్వపడేలా చేస్తారన్న నమ్మకం నాకుంది. యావత్ దేశం మీ కోసం ఉత్సాహంగా ఉంది. గుడ్ లక్, టీమ్ ఇండియా” అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.
ఇక ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, “బర్మింగ్హామ్లో 2022 కామన్ వెల్త్ గేమ్స్ ప్రారంభంలో భారత బృందానికి శుభాకాంక్షలు. మన అథ్లెట్లు తమ అత్యుత్తమ ఆటతీరును అందజేస్తారని మరియు వారి అద్భుతమైన క్రీడా ప్రదర్శనల ద్వారా భారత ప్రజలకు స్ఫూర్తిని ఇస్తారని నాకు నమ్మకం ఉంది” అని అన్నారు. జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు 12 రోజుల పాటుగా కామన్ వెల్త్ గేమ్స్-2022 జరగనున్నాయి. కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ ప్రాతినిధ్యం వహించడం ఇది 18వ సారి. ఈసారి భారత్ నుంచి మొత్తం 215 మంది అథ్లెట్లు, 16 క్రీడా విభాగాలకు సంబంధించిన 141 ఈవెంట్లలో పాల్గొంటున్నారు. 107 మంది కోచ్ లు, సిబ్బంది, అధికారులు కూడా ఉన్నారు. మొత్తం 20 క్రీడా విభాగాలలో 280కి పైగా ఈవెంట్లల్లో 72 దేశాలకు చెందిన 5,000లకు పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY