కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లుగా శుక్రవారం వెల్లడించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో సహా పార్టీ యొక్క అన్ని పదవులకు రాజీనామా చేసినట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఐదు పేజీల లేఖ రాశారు. సోనియా గాంధీకి రాసిన ఐదు పేజీల లేఖలో పార్టీతో తన సుదీర్ఘ అనుబంధాన్ని, ఇందిరా గాంధీతో తనకున్న సన్నిహిత సంబంధాలను వివరించారు. అలాగే పార్టీ అధ్యక్ష ఎన్నికలపైన, విధాన నిర్ణయాలు, కీలక నేత రాహుల్ గాంధీ పైన విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత, ముఖ్యంగా 2013లో పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యాక అంతకుముందు ఉన్న మొత్తం సంప్రదింపుల యంత్రాంగాన్ని ఆయన కూల్చివేశారని అన్నారు. సీనియర్లు, అనుభవజ్ఞులైన నాయకులందరినీ పక్కనబెట్టి, అనుభవం లేని దళారుల కొత్త వర్గం పార్టీ వ్యవహారాలను నడిపించడం ప్రారంభమైందని విమర్శించారు.
2019 ఎన్నికల తర్వాత పార్టీ పరిస్థితి మరింత దిగజారిందని, రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవీ నుంచి హడావిడిగా తప్పుకున్నాక సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారన్నారు. గత మూడు సంవత్సరాలుగా ఆమె అలాగే తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారన్నారు. “మీరు కేవలం నామమాత్రపు వ్యక్తి అయితే, అన్ని ముఖ్యమైన నిర్ణయాలను రాహుల్ గాంధీ తీసుకుంటున్నారు లేదా అతని సెక్యూరిటీ గార్డులు మరియు పీఏలు అధ్వాన్నంగా తీసుకుంటున్నారు” అని సోనియాగాంధీకి రాసిన ఆజాద్ పేర్కొన్నారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన సీనియర్లను, వారి సేవలను విస్మరించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎప్పటికి “తిరిగి రాదు” అనే స్థాయికి చేరుకుందని అన్నారు.
కాగా గత కొంతకాలంగా కాంగ్రెస్ లో నాయకత్వ, విధానాల మార్పుల కోసం పోరాడుతున్న అసమ్మతి వర్గమైన “జీ-23” నాయకుల గ్రూపులో గులాం నబీ ఆజాద్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే గులాం నబీ ఆజాద్ ఇటీవలే ఆరోగ్య కారణాల దృష్ట్యా జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ పదవీని తిరస్కరించిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల్లోనే పార్టీకి కూడా రాజీనామా ప్రకటించడం నేతలను ఆశ్చర్యానికి గురిచేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY