మేఘాలయ ముఖ్యమంత్రిగా నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) ప్రెసిడెంట్ కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం ఉదయం షిల్లాంగ్ లోని రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో మేఘాలయ గవర్నర్ ఫాగు చౌహాన్ మేఘాలయ ముఖ్యమంత్రిగా కాన్రాడ్ సంగ్మా చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా మేఘాలయ ముఖ్యమంత్రిగా కాన్రాడ్ సంగ్మా వరుసగా రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, పలువురు బీజేపీ నేతలు, పలు పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కాన్రాడ్ సంగ్మాకు ప్రధాని మోదీ, బీజేపీ నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు.
మరోవైపు కాన్రాడ్ సంగ్మాతో పాటుగా 12 మంది సభ్యుల మంత్రిమండలితో గవర్నర్ ఫాగు చౌహాన్ ప్రమాణం చేయించారు. వీరిలో ఎన్పీపీకి చెందిన టిన్సాంగ్ మరియు స్నియాభలాంగ్ ధర్ ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్పీపీ నుండి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, యూడీపీ నుండి ఇద్దరు, బీజేపీ, హెచ్ఎస్పీడీపీ నుండి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 12 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు.
ముందుగా మేఘాలయ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాన్రాడ్ సంగ్మా సారథ్యంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) 26 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. మొత్తం 60 స్థానాలకు గానూ 59 చోట్ల పోలింగ్ జరగగా, ఎన్పీపీ 26 స్థానాల్లో, యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (యూడీపీ) 11 స్థానాల్లో, కాంగ్రెస్ 5 స్థానాల్లో, టీఎంసీ 5 స్థానాల్లో, వాయిస్ ఆఫ్ ది పీపుల్ పార్టీ 4 స్థానాల్లో, బీజేపీ 2, హెచ్ఎస్పీడీపీ 2, పీడీఎఫ్ 2, ఇండిపెండెంట్ అభ్యర్థులు 2 స్థానాల్లో విజయం సాధించారు. మేఘాలయలో సీఎం పీఠం దక్కించుకునేందుకు ఏ పార్టీ/కూటమికీ అయినా 31 అసెంబ్లీ స్థానాలు దక్కించుకోవాల్సి ఉండగా, ఎన్పీపీకి బీజేపీ, యూడీపీ, హెచ్ఎస్పీడీపీ పార్టీలు మద్దతు తెలిపాయి. దీంతో మేఘాలయలో మొత్తం 45 మంది ఎమ్మెల్యేలతో ఎన్పీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే మేఘాలయ సీఎంగా కాన్రాడ్ సంగ్మా నేడు రెండోసారి బాధ్యతలు చేపట్టారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE