ఏప్రిల్ 14, మంగళవారం నాడు వేల సంఖ్యలో వలస కూలీలు ముంబై లోని బాంద్రా రైల్వేస్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. లాక్డౌన్ కారణంగా పనుల్లేక, డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నామని, తిరిగి తమ సొంత రాష్ట్రాలకు పంపించాలని వారు డిమాండ్ చేశారు. సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రభుత్వం రైళ్లు నడుపుతుందనే అసత్య ప్రచారాలు నమ్మే మంగళవారం ఉదయం నుంచి బాంద్రా రైల్వేస్టేషన్కు పెద్దసంఖ్యలో వలస కూలీలు చేరుకున్నారని మరికొంతమంది చెబుతున్నారు. కరోనా నియంత్రణ చర్యలో భాగంగా దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సాయంత్రం సమయానికి మరికొందరు అక్కడికి చేరుకొని నిరసన చేపట్టడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి అందరిని చెదరగొట్టారు.
మహారాష్ట్ర పర్యావరణ, పర్యాటక శాఖ మంత్రి, ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే తనయుడు ఆదిత్య ఠాక్రే మాట్లాడుతూ ఈ వలస కూలీల ఘటనకు కేంద్రమే బాధ్యత వహించాలని చెప్పారు. ముందుగా లాక్డౌన్ ప్రకటించి రైళ్లు ఆగిన రోజునే, రైళ్లను మరో 24 గంటలు పాటు నడపడానికి అనుమతించాలని తమ రాష్ట్రం కోరిందని తద్వారా వలస కార్మికులు ఇంటికి తిరిగి వెళ్లే అవకాశం ఉండేదని చెప్పారు. సీఎం ఉద్దవ్ థాకరే ఈ సమస్యను ఇటీవల పీఎం-సీఎంల వీడియో కాన్ఫరెన్స్లో లేవనెత్తారని చెప్పారు. వలస కూలీలు వారి ఇళ్లకు వెళ్లేలా రోడ్మ్యాప్ను ప్రకటించాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు.
మరోవైపు ముంబైలో జరిగిన పరిణామాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే తో ఫోన్లో మాట్లాడారు. లాక్డౌన్ అమల్లో ఉండగానే వేలాది జనం రోడ్లపై గుమికూడటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి అన్నివిధాలా సహకారం అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఇక ముంబైలో వలస కార్మికుల కోసం ఆన్లైన్లో ‘చలో ఘర్ కి ఒరే’ ప్రచారం నిర్వహిస్తున్న వినయ్ దూబే అనే వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]