మనీ లాండరింగ్ కు సంబంధించిన కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉంటున్న కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి డీకే శివకుమార్ కు అక్టోబర్ 23, బుధవారం నాడు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 లక్షల వ్యక్తిగత పూచికత్తుపై న్యాయస్థానం బెయిల్ కు ఆమోదం తెలిపింది. తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు ఇటీవలే ట్రయల్ కోర్టు నిరాకరించడంతో, ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోగా కోర్టు ఈ రోజు తీర్పు ఇచ్చింది. శివ కుమార్ కు బెయిల్ మంజూరు చేయడం వలన కేసులో సాక్షాలకు సంబంధించిన పత్రాలు తారుమారు చేసే అవకాశం లేదని, అవ్వన్నీ ఈడీ అధికారుల వద్దే ఉన్నాయని న్యాయమూర్తి వెల్లడించారు.
మరో వైపు తీహార్ జైలులో ఉన్న కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ నేత అంబికా సోని, డీకే సోదరుడు సురేష్ తో కలిసి పరామర్శించారు. కష్టకాలంలో పార్టీ ఆయనకు అండగా ఉంటుందని సోనియా గాంధీ భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది. సోనియాగాంధీ కంటే ముందుగా సీనియర్ కాంగ్రెస్ నేతలైన అహ్మద్ పటేల్, ఆనంద్ శర్మలు డీకే శివకుమార్ను కలిసి చర్చించారు. సెప్టెంబర్ 3న మనీ ల్యాండరింగ్ కేసులో డీకే శివకుమార్ ను అరెస్ట్ చేసిన తరువాత అతని సోదరుడు డీకే సురేష్, ఆయన కుమార్తె ఐశ్వర్యను సైతం ఈడీ అధికారులు ప్రశ్నించారు. వీరితో పాటు డీకే శివకుమార్ తల్లికి, భార్యకు కూడ ఈడీ సమన్లు జారీ చేసింది.
[subscribe]