దేశంలో రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం సోమవారం నాడు ప్రారంభమైంది. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తొలిడోసు కరోనా వాక్సిన్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కూడా మంగళవారం నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ కోర్టు కాంప్లెక్స్ వద్ద వ్యాక్సినేషన్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ కార్యక్రమంలో అర్హులైన న్యాయమూర్తులు సహా వారి కుటుంబ సభ్యులు, రిటైర్డ్ న్యాయమూర్తుల కుటుంబాలు కూడా వ్యాక్సిన్ తీసుకోనున్నట్టు తెలుస్తుంది. న్యాయమూర్తులు మరియు వారి కుటుంబాలు సుప్రీంకోర్టు కాంప్లెక్స్ వద్ద లేదా ప్రభుత్వం ఎంపిక చేసిన జాబితాలో ఉన్న ఏ ఆసుపత్రిలోనైనా కరోనా వ్యాక్సిన్ తీసుకునే అవకాశం ఉంది.
ఇక న్యాయమూర్తులకు కూడా తాము ఏ వ్యాక్సిన్ తీసుకోవాలో ఎన్నుకునే అవకాశం ఉండదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రారంభమైన రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలిక వ్యాధులుతో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి వ్యాక్సిన్ వేస్తున్నారు. ఇందుకోసం www.cowin.gov.in పోర్టల్ లో పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తుండగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒక్కో వ్యక్తికీ ఒక్కో డోసుకు ధరను రూ.250గా నిర్ణయించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ