తెలంగాణ ఆర్టీసీ కార్మికులు గత 19 రోజులుగా తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలంటూ సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ రోజు దిల్సుఖ్ నగర్ బస్టాండ్లో ఆర్టీసీ ధూం ధాం కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ పై వెనక్కి తగ్గేది లేదని, ఏ ఒక్క డిమాండ్ ను పక్కన బెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేసారు. ఆర్టీసీ విలీనంపై వెనక్కి తగ్గినట్లు ఎక్కడైనా చెప్పినట్లుగా నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు. కార్మికులు, ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని, కార్మిక సంఘాల ఐక్యత దెబ్బతినదని, ఎవరూ అధైర్య పడొద్దని సూచించారు. 2004 లో టీడీపీ పార్టీ ఓటమికి ఆర్టీసీ సమ్మె కారణమని గుర్తు చేసారు. తెలంగాణ వస్తే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పారని, ఇచ్చిన మాటకు కట్టుబడాలని కోరారు. అవసరమైతే కార్మికుల సమస్యలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని, చేస్తున్న పోరాటం అన్యాయమని తేలితే తక్షణమే విధులకు హాజరవుతామని చెప్పారు.
‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం మీదనే పట్టుపట్టబోమని, విలీన డిమాండ్ ఒక్కటే ప్రధానం కాదని కార్మికుల తరపు న్యాయవాది చెప్పారు. దీంతో కార్మికులు విలీనం డిమాండ్ వదులుకున్నట్లయింది. కార్మికులు లేవనెత్తిన డిమాండ్లలో 21 అంశాలను పరిశీలించాలని కోర్టు కోరింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ ఆ డిమాండ్లు పరిశీలించి, అధ్యయనం చేయండి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం నాడు ప్రగతి భవన్ లో నిర్వహించిన సమీక్షలో అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం ప్రకటనపై బుధవారం నాడు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి వివరణ ఇచ్చారు. అక్టోబర్ 24, గురువారం నాడు ఇందిరాపార్క్ వద్ద చేపట్టే ధర్నాకు భారీ స్థాయిలో తరలిరావాలని కార్మికులకు పిలుపు నిచ్చారు.
[subscribe]