ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికలు డిసెంబర్ 4న జరిగిన విషయం తెలిసిందే. ఎంసీడీ ఎన్నికల్లో మొత్తం 250 వార్డులకు గానూ, 1349 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో నేడు (డిసెంబర్ 7, బుధవారం) ఎంసీడీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. బుధవారం ఉదయం 8 గంటలకు అధికారులు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. కాగా ఎంసీడీ ఫలితాల్లో కౌంటింగ్ ప్రారంభించినప్పటి నుంచి అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.
తాజా సమాచారం ప్రకారం 41 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ 121 వార్డులలో ఆధిక్యంలో ఉండగా, భారతీయ జనతా పార్టీ 96 వార్డులలో ఆధిక్యంలో ఉంది. కాగా ఇప్పటికి బీజేపీ 10 స్థానాల్లో, ఆప్ 6 స్థానాల్లో విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ కేవలం 11 వార్డుల్లో మాత్రమే ఆధిక్యంలో ఉండగా, ఇండిపెండెట్స్ 5 వార్డుల్లో, బీఎస్పీ అభ్యర్థి ఒక చోట ఆధిక్యంలో ఉన్నారు.
ముందుగా ఎంసీడీ ఫలితాల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు ఉంటుందని భావించగా, ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా ఆప్ వైపే మొగ్గుచూపాయి. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ విజయంపై ముందునుంచి పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా నేడు కౌంటింగ్ జరుగుతుండగా ఆప్ కు సగానికిపైగా వార్డుల్లో బీజేపీ గట్టి ఇచ్చింది. 2007 నుంచి వరుసగా మూడు సార్లు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ ఈసారి కూడా సత్తాచాటుతూ పోటీలో నిలిచింది. కౌంటింగ్ ట్రెండ్ ప్రకారం ఆప్ అత్యధిక స్థానాలు గెలుచుకుని మేయర్ పదవీని దక్కించుకునే అవకాశం ఉండగా, బీజేపీ రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉంది. డిసెంబర్ 4న ఎంసీడీలో పోలింగ్ జరగగా, మొత్తం 1.45 కోట్ల మంది ఓటర్లలో, 73 లక్షల మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవడంతో 50.48% ఓటింగ్ మాత్రమే నమోదైంది. మరోవైపు కౌంటింగ్ ట్రెండ్ ను బట్టి ఆప్ కార్యాలయం వద్ద కార్యకర్తలు సంబరాలకు సిద్ధమవుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE