తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత హైదరాబాద్ బుక్ ఫెయిర్ జాతీయ స్థాయి పుస్తక ప్రదర్శనగా ఎదిగిందని, ఇది జ్ఞాన తెలంగాణకు పనిముట్టుగా ఉపయోగపడుతుందని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంగళవారం మంత్రి కార్యాలయంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ మంత్రిని కలిసి ఈ నెల 22 నుంచి జనవరి 1 వరకు తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్) స్టేడియంలో పుస్తక ప్రదర్శనకు అనుమతి ఇవ్వవలసిందిగా కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించి ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఆధ్వర్యంలో గత ముప్పై అయిదు సంవత్సరాలుగా ఇందిరాపార్క్ దగ్గర ఉన్న తెలంగాణ కళాభారతి ప్రాంగణంలో అతిపెద్ద బుక్ ఫెయిర్ నిర్వహించడం అభినందించదగిందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా బ్రహ్మాండంగా నిర్వహిస్తూ లక్షలాది మంది పుస్తక ప్రియులను కదిలించే శక్తిగా పుస్తక ప్రదర్శన మారడం గర్వించదగిందన్నారు. అన్ని భాషల పుస్తకాలతో పాటు తెలుగు భాషా సంస్కృతి, తెలంగాణ చరిత్రకు సంబంధించిన పుస్తకాలు మరియు దేశ వ్యాప్తంగా దాదాపు మూడు వందలకు పైగా పబ్లిషర్స్ విచ్చేయనుండడంతో ఇది జాతీయ పుస్తక ప్రదర్శనగా మారిందన్నారు. ఈరోజుల్లో చాలామంది పుస్తకాలు చదవడం తక్కువైపోయిందంటున్నారు కానీ, బుక్ ఫెయిర్ కు వస్తున్న పుస్తక ప్రియులను చూస్తే చదువరుల సంఖ్య పెరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిత్య చదువరి కావడం వల్ల ఈ పుస్తక ప్రదర్శనకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుందని తెలిపారు.
ప్రపంచంలో అనేక ఉద్యమాలకు, అనేక రకాల పరిశోధనలకు, విజ్ఞాన భాండాగారాలుగా ఈ పుస్తకాలే నిలుస్తాయన్నారు. ప్రభుత్వం తరుపున పుస్తక ప్రదర్శన కోసం ప్రతీ ఏడాది తెలంగాణ కళాభారతి స్ధలాన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ బుక్ ఫెయిర్ కు రాష్ట్ర సాంస్కృతిక శాఖ తరుపున, ప్రభుత్వం తరుపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. బుక్ ఫెయిర్ ను విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న, బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షులు కోయ చంద్రమోహన్ పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE