పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీలు ఇప్పటికే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సారధ్యంలోని ఐప్యాక్ సంస్థ సేవలు వినియోగించుకుంటుండగా, తాజాగా దక్షిణాదికి చెందిన మరోపార్టీ ప్రశాంత్ కిశోర్ తో ఒప్పందం కుదుర్చుకుంది. 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ ఐప్యాక్ సంస్థతో కలిసి తమ పార్టీ పనిచేస్తుందని డీఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ ఫిబ్రవరి 2, ఆదివారం నాడు వెల్లడించారు. ఐప్యాక్ సంస్థలో పనిచేస్తున్న భావసారూప్యత కల్గిన తమిళనాడు నవతర యువకులతో కలిసి పనిచేయబోతున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
2021 ఎన్నికల్లో తమ వ్యూహరచనకు సహాయం చేసి తమిళనాడుకు పూర్వ వైభవం తెచ్చేందుకు ఐప్యాక్ సభ్యులు సహాయపడతారని స్టాలిన్ పేర్కొన్నారు. ఒప్పందంపై ఐప్యాక్ సంస్థ స్పందిస్తూ ‘తమిళనాడు ఐప్యాక్ బృందం 2021 అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకే పార్టీ ఘన విజయం సాధించడంలో సహాయపడటానికి ఉత్సాహంగా ఉంది. అలాగే స్టాలిన్ సమర్థవంతమైన నాయకత్వంలో రాష్ట్రాన్ని పురోగతి మరియు శ్రేయస్సు మార్గంలో నిలబెట్టడానికి దోహదపడతామని’ పేర్కొన్నారు.
[subscribe]