ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా వెల్లింగ్టన్ లోని బేసిన్ రిజర్వ్ స్టేడియంలో భారత్ , న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలిటెస్టులో న్యూజిలాండ్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యం సాధించింది. 144/4 వద్ద నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ జట్టు మరో 47పరుగులు జతచేసి ఆలౌటైంది. నాలుగో రోజు తొలి సెషన్లోనే కీలకమైన అజింక్య రహానె(29), హనుమ విహారి(15), రిషభ్ పంత్(25) వికెట్లు కోల్పోవడంతో ఎలాంటి పోటీ ఇవ్వలేకపోయింది. రవిచంద్రన్ అశ్విన్(4), ఇషాంత్ శర్మ(12), మహ్మద్ షమి(2), జస్ప్రీత్ బుమ్రా (0) తక్కువ వ్యవధిలోనే పెవిలియన్ బాట పట్టడంతో భారత్ రెండో ఇన్నింగ్స్లో కేవలం 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే 9 పరుగుల ఆధిక్యంతో ఇన్నింగ్స్ పరాజయం నుంచి బయటపడింది. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ 5 వికెట్లు, బౌల్ట్ 4 వికెట్లు, గ్రాండ్ హోమ్ ఒక వికెట్ పడగొట్టారు. 9 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 1.4 ఓవర్లలోనే ఘనవిజయాన్ని అందుకుంది. ఓపెనర్లు టామ్ లాథమ్ 7 పరుగులు, టామ్ బ్లండెల్ 2 పరుగులు సాధించారు. దీంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో భారత్ తొలిసారిగా పరాజయం ఎదుర్కుంది. ఇక రెండో టెస్టు ఫిబ్రవరి 29న హగ్లే ఓవల్ స్టేడియంలో జరగనుంది.
భారత్ – న్యూజిలాండ్ తోలి టెస్టు వివరాలు:
భారత్ తోలి ఇన్నింగ్స్: 165-10
అజింక్య రహానే (46), మయాంక్ అగర్వాల్ (34), షమీ (21)
సౌథీ 4/49, జేమిసన్ 4/39, బౌల్ట్ 1/57
న్యూజిలాండ్ తోలి ఇన్నింగ్స్: 348-10
విలియంసన్ (89), రాస్ టేలర్ (44), జేమిసన్ (44), గ్రాండ్ హోమ్ (43)
ఇషాంత్ శర్మ 5/68, అశ్విన్ 3/99, షమీ 1/91, బుమ్రా 1/88
భారత్ రెండవ ఇన్నింగ్స్: 191-10
మయాంక్ అగర్వాల్ (58), అజింక్య రహానె(29), రిషభ్ పంత్(25)
సౌథీ 5/61, బౌల్ట్ 4/39, గ్రాండ్ హోమ్ 1/28
న్యూజిలాండ్ రెండవ ఇన్నింగ్స్: 9-0
టామ్ లాథమ్ (7*), టామ్ బ్లండెల్ (2*)