మయన్మార్లోని ‘జేడ్’ మైనింగ్ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడడంతో ఒకరు మృతిచెందారు. మరో 70 మంది వరకు గల్లంతయ్యారు. కాచిన్ రాష్ట్రంలోని హ్పకాంత్ అనే ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. కాగా ఈ ఘటనలో అనేక మంది బురదలో చిక్కుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే, రెస్క్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బురదలో గల్లైంతన వారి కోసం విస్తృత గాలింపు చేపడుతున్నారు. ఇక్కడ ఆభరణాలలో వాడే ఆకుపచ్చరాళ్ల కోసం మైనింగ్ చేస్తుంటారు.
జేడ్ గనులు మయన్నార్లో ఎంతో ప్రసిద్ధి. లారీల నుంచి ఉపరితల గనుల్లో వేసిన శిథిలాలు ఓవర్ఫ్లో అయి కిందికి జారడంతో కొండచరియలు విరిగిపడినట్లు భావిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ‘ఈ ప్రమాదంలో సుమారు 70- 100 మంది గల్లంతయ్యారు. తీవ్రంగా గాయపడిన 25 మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. అందులో ఒకరు చనిపోయారు. గల్లంతైన వారిని కనుగొనేందుకు సుమారు 200 మందితో గాలింపు చేపడుతున్నాం’ అని సహాయక బృందంలోని కీలక అధికారి చెప్పారు. ముఖ్యంగా ప్రస్తుతం ప్రమాదం చోటు చేసుకున్న హ్పకాంత్కు ప్రపంచంలోనే అతిపెద్ద జేడ్ గనిగా పేరుంది. కానీ ఇక్కడి గనులు చాల ప్రమాదకరం. గతంలో ఇక్కడ అనేక ప్రమాదాలు కూడా జరిగాయి. చాలామంది మృత్యువాత పడ్డారు. కాబట్టే, హ్పకాంత్ ప్రాంతంలో జేడ్ మైనింగ్పై నిషేధం కూడా విధించారు.
ఈ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని మయన్మార్ ప్రభుత్వం 2018లో కొత్త మైనింగ్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే మైనింగ్ కార్యకలాపాలను అరికట్టడానికి సంబంధిత అధికారులకు పరిమితంగా మాత్రమే అధికారమిచ్చింది. దీనికి తోడు సిబ్బంది లేమితో చట్ట విరుద్ధంగా జరిగే మైనింగ్ కార్యకలాపాలకు అడ్డుకట్టపడడం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే, ఇక్కడి స్థానికులకు సరైన ఉపాధి అవకాశాలు లేవు. దీనికి తోడు కొవిడ్ పరిస్థితుల కారణంగా వీరి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. దీంతో వీరు తరచూ నిబంధనలు ఉల్లంఘించి మరీ అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారు. దీనికి తోడు మైనింగ్ వ్యవహారాలకు సంబంధించి వీరికి సరైన అవగాహన, నైపుణ్యం లేవు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ