బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత కరోనా వ్యాక్సిన్ పంపిణీ హామీని ప్రజలు ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే దేశంలో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ పూర్తయి, పెద్ద స్థాయిలో ఉత్పత్తి మొదలవగానే బీహార్ రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయిస్తామని బీజేపీ పేర్కొంది. బీజేపీ హామీపై దేశంలో ప్రతిపక్షాలు, ఇతర వర్గాలనుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ అంశంపై సాకేత్ గోఖలే అనే ఆర్టీఐ కార్యకర్త కేంద్ర ఎన్నికల సంఘంను(ఈసీ) ఆశ్రయించి, సమాచారం కోరారు. అనంతరం ఈసీ స్పందిస్తూ బీజేపీ ఇచ్చిన ఉచిత కరోనా వ్యాక్సిన్ పంపిణీ హామీ ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందకు రాదని స్పష్టం చేస్తూ, క్లిన్ చిట్ ఇచ్చింది. ఎన్నికల మేనిఫెస్టో తయారీకి సంబంధించి బీజేపీ ఇచ్చిన హామీ ఏ నిబంధననూ ఉల్లంఘించడం లేదని ఈసీ సమాచారమిచ్చింది. నిబంధనలకు అనుగుణంగా ప్రజల సంక్షేమం దృష్ట్యా పార్టీలు సమంజసంగా ఎలాంటి హామీలనైనా మేనిఫెస్టోలో పొందుపర్చి, ప్రజల వద్దకు తీసుకెళ్లే అవకాశం ఉందని ఈసీ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ