పంజాబ్ రాష్ట్రం లుథియానాలోని జిల్లా సెషన్స్ కోర్టు పేలుడు శబ్దంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గురువారం కోర్టు సముదాయంలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కోర్టు కాంప్లెక్స్ రెండో అంతస్తులోని టాయిలెట్స్ లో ఈ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున శబ్దం, పొగలు రావడంతో కోర్ట్ ప్రాంగణంలో ఉన్న వారు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అందరూ బయటకు పరుగులు తీశారు. ఈలోపు చుట్టుపక్కల ఉండే స్థానికులు కోర్టు బయట గుమిగూడారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గురువారం న్యాయవాదులు సమ్మెలో ఉండటం విశేషం. పేలుడు జరిగిన సమయంలో కోర్టు కాంప్లెక్స్ లో కొద్ది మంది మాత్రమే ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఈ ఘటనకు గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
పేలుడు ఘటన వివరాలు ఆరా తీసిన ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ.. కొంచెంసేపట్లో ఘటనా స్థలాన్ని సందర్శించనున్నట్లు తెలిపారు. బాధ్యులను వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సైతం ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై దర్యాప్తు చేసేందుకు ఎన్ఐఏ బృందాలు ఘటనా స్థలానికి బయల్దేరినట్లు సమాచారం. ఇటీవల ఢిల్లీలోని రోహిణి కోర్టులోనూ పేలుడు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ