భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆగస్టు 13, మంగళవారం నాడు రాజస్థాన్ నుంచి రాజ్యసభకు జరగనున్న ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. జైపూర్ లో నామినేషన్ దాఖలు చేసే సమయంలో మన్మోహన్ సింగ్ వెంట రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మరియు ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఈ ఏడాది జూన్ లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాజ్యసభ సభ్యుడు మదన్ లాల్ సైనీ మరణం తరువాత ఈ స్థానం ఖాళీగా ఉంది. రాజస్థాన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఈసి) రాజస్థాన్ రాజ్యసభ స్థానానికి ఇటీవలే ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఈ స్థానానికి నామినేషన్లు దాఖలు చేయడానికి ఆగస్టు 14 చివరి తేదీగా నిర్ణయించారు.
గత డిసెంబర్ లో రాజస్థాన్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీకి మొత్తం 100 మంది శాసనసభ్యులు ఉన్నారు, అంతేకాకుండా మరో 12 మంది ఇండిపెండెంట్ సభ్యులు, ఆరుగురు బిఎస్పీ శాసనసభ్యుల మద్దతు ఉండడంతో మన్మోహన్ సింగ్ రాజ్యసభకు ఎన్నికవడం లాంఛనమే అవుతుంది. దాదాపుగా 30 సంవత్సరాల నుండి అసోం నుంచి ప్రాతినిధ్యం వహించిన మన్మోహన్ సింగ్, ఇప్పుడు కాంగ్రెస్ కు తగిన బలం లేకపోవడంతో ఈసారి రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. మరోవైపు రాష్ట్రంలో 73 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ పార్టీ ఇంతవరకు తమ అభ్యర్థిని ప్రకటించలేదు.
[subscribe]
[youtube_video videoid=4PTtrbqKIZs]