ప్రపంచ దేశాలకు సాధ్యం కానిది భారత్ సుసాధ్యం చేసి చూపించింది. అగ్రరాజ్యాలు కూడా చేయలేని అద్భుతాన్ని చేసి సత్తా చాటింది. టెక్నాలజీలో శర వేగంగా దూసుకెళ్తున్న దేశాలు కూడా ఆ ఘనతను సాధించలేకపోయాయి. భారత్ కంటే ముందే చరిత్ర సృష్టించాలని ప్రయత్నించిన దేశాలు విఫలమే అయ్యాయి. జాబిల్లి దక్షిణ ధృవంపై మువ్వన్నెల జెండాను ఎగురవేసి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సరికొత్త రికార్డు నెలకొల్పింది. జాబిల్లి సౌత్ పోల్పై కాలు మోపిన మొదటి దేశంగా చరిత్ర సృష్టించింది. 14 రోజుల పాటు ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై పరిశోధనలు చేసి పలు కీలక సమాచారాన్ని ఇస్రోకు పంపించాయి. ఆ తర్వాత స్లీప్ మోడ్లోకి వెళ్లిన రోవర్, ల్యాండర్ ఇప్పటికీ స్లీప్ మోడ్లో నుంచి బయటకు రాకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ల్యాండర్, రోవర్ లేస్తాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ముందుగా చంద్రయాన్-1 ప్రయోగాన్ని చేపట్టారు. అది విఫలం కావడంతో.. కొద్దిరోజులకు చంద్రయాన్-2 ప్రయోగం చేపట్టారు. అయితే అనూహ్యంగా ఈ ప్రయోగం కూడా ఫెయిల్ అయింది. ల్యాండింగ్ సమయంలో విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కుప్పకూలిపోయింది. ఈ రెండు ప్రయోగాల సమయంలో ఎదురయిన సమస్యలు అధిగమించేలా చంద్రయాన్-3 ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టారు. జులై 14 చంద్రయాన్-3ని మోసుకొని రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. విజయవంతంగా ఒక్కో దశను దాటుకుంటూ ముందుకెళ్లింది. ఆగష్టు 23న సాయంత్రం 6.03 గంటలకు చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయింది.
ఆ తర్వాత విక్రమ్ ల్యాండర్లో నుంచి రోవర్ బయటకొచ్చి పరిశోధనలు ప్రారంభించింది. చంద్రుడిపై దాదాపు 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించి పలు కీలక సమాచారాన్ని సేకరించింది. ల్యాండర్ సాయంతో ఆ సమాచారాన్ని ఇస్రోకు చేరవేసింది. అలాగే కొన్ని ఫొటోలను కూడా పంపించింది. 14 రోజుల పాటు చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండర్, రోవర్ పరిశోధనలు సాగించాయి. అయితే ఆ తర్వాత 14 రోజుల పాటు చంద్రుడిపై రాత్రి సమయం ఉంటుంది. ఆ సమయంలో ఉష్ణోగ్రత మైనస్ 200 సెల్సియస్ డిగ్రీల వరకు పడిపోతుంది. ఈక్రమంలో ఇస్రో శాస్త్రవేత్తలు సెప్టెంబర్ 2న రోవర్ను 4న ల్యాండర్ను స్లీప్ మోడ్లోకి పంపించారు.
ప్రస్తుతం చంద్రుడి దక్షిణ ధృవంపై వెలుతురు వచ్చి పగటి సమయం కొనసాగుతోంది. ఈక్రమంలో ల్యాండర్, రోవర్లను స్లీప్ మోడ్లో నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించినప్పటికీ అవి నిద్రానస్థితిలో నుంచి బయటకు రావడం లేదు. మళ్లీ చంద్రుడి దక్షిణ ధృవంపై రాత్రి సమయం వచ్చే సమయం ఆసన్నమవుతోంది. అయినప్పటికీ విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు స్లీప్ మోడ్లో నుంచి బయటకు రావడం లేదు. ఈక్రమంలో క్రమక్రమంగా ల్యాండర్, రోవర్లపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. చంద్రయాన్-3 కథ ఇంతటితో ముగిసినట్టే అనే వాదనలు వినిపిస్తున్నాయి.
అటు ఇస్రో మాజీ ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ కూడా చంద్రయాన్-3 కథ ఇక ముగిసినట్లేనని అభిప్రాయపడ్డారు. ల్యాండర్, రోవర్లో స్లీప్ మోడ్లో నుంచి బయటకు వస్తాయనే ఆశలు రోజురోజుకు ఆవిరైపోతున్నాయని పేర్కొన్నారు. కానీ చంద్రయాన్-3 నుంచి అనుకున్న ఫలితం మాత్రం వచ్చిందని వ్యాఖ్యానించారు. విలువైన సమాచారాన్ని ల్యాండర్,రోవర్లు ఇస్రోకు చేరవేశాయని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో చంద్రుడి నమూనాలను సేకరించి భూమిపైకి తీసుకొచ్చే ప్రాజెక్టులు కూడా కచ్చితంగా ఉంటాయని కిరణ్ కుమార్ వెల్లడించారు.