కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పంజాబ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ గురువారం నాడు భారతీయ జనతా పార్టీలో (బీజేపీ) చేరారు. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో సునీల్ జాఖర్ కాషాయ కండువా కప్పుకున్నారు. సునీల్ జాఖర్ ను జేపీ నడ్డా పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ, పంజాబ్ను బలోపేతం చేయాలంటే పంజాబ్లో జాతీయవాద శక్తులు అంతా కలిసి రావడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సునీల్ జాఖర్ మాట్లాడుతూ, 50 ఏళ్లుగా తమ కుటుంబంలోని మూడుతరాలు కాంగ్రెస్ పార్టీకి సేవ చేశాయని, ఇప్పుడు పార్టీని వీడడం అంత సులువు కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీని వ్యక్తిగత సమస్యల వల్ల వీడలేదని, పంజాబ్లో జాతీయవాదం, సోదరత్వం మరియు ఐక్యత వంటి సమస్యల వల్లనే వీడానని పేర్కొన్నారు.
ముందుగా సునీల్ జాఖర్ మే 15న ఫేస్బుక్ లైవ్ లో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 18 స్థానాలు మాత్రమే దక్కించుకుని అధికారాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల అనంతరం మాజీ సీఎం చరణ్ జీత్ సింగ్ సన్నీపై విమర్శలు చేయడం, ఇతర అంశాలపై సునీల్ జాఖర్ మీద పలువురు నేతలు హైకమాండ్ కు ఫిర్యాదు చేయడంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై రెండేళ్ల పాటుగా అన్ని పదవుల నుంచి ఆయన్ను తొలగిస్తూ కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ చర్యలు తీసుకుంది. 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఉన్న తన పట్ల అలా వ్యవహరించడం పట్ల చాలా బాధపడ్డానని సునీల్ జాఖర్ చెప్పారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి సునీల్ జాఖర్ రాజీనామా చేసి, తాజాగా బీజేపీలో చేరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF