పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతపోరాడినా అధికారం దక్కించుకోలేని బీజేపీ పార్టీకి, తాజాగా ఆ రాష్ట్రంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర బీజేపీలో కీలకంగా వ్యవహరించిన నేత, మాజీ కేంద్రమంత్రి, పార్టీ సిట్టింగ్ ఎంపీ బాబుల్ సుప్రియో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)లో చేరారు. బాబుల్ సుప్రియో శనివారం నాడు టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ సమక్షంలో పార్టీలో చేరి, టీఎంసీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా బాబుల్ సుప్రియోను పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నట్టు టీఎంసీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు.
పశ్చిమబెంగాల్ కు చెందిన ప్రముఖ గాయకుడైన బాబుల్ సుప్రియో 2014 లోక్ సభ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. 2014, 2019 లలో అసన్సోల్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎంపీగా విజయం సాధించారు. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ హయంలో తొలిసారి ఏర్పాటైన ప్రభుత్వంలో కేంద్ర పట్టణ అభివృద్ధిశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. అలాగే 2019లో ఏర్పాటైన ప్రభుత్వంలో కూడా కేంద్ర పర్యావరణం, అటవీ శాఖ సహాయ మంత్రిగా విధులు నిర్వహించారు. అయితే ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణకు ముందు మంత్రి వర్గం నుంచి తప్పించడంతో బాబుల్ సుప్రియో తన పదవికి రాజీనామా చేశారు. కేంద్ర మంత్రివర్గంలో చోటు కోల్పోయిన కొన్ని రోజులకే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్టు బాబుల్ సుప్రియో ప్రకటించారు. ఆ సందర్భంగా ఇతర ఏ పార్టీలో కూడా చేరడం లేదని తెలిపారు. అయితే సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీ పూర్ సహా మరో రెండు స్థానాల్లో ఉపఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అనూహ్యంగా బాబుల్ సుప్రియో బీజేపీకి గుడ్ బై చెప్పి టీఎంసీలో చేరడం విశేషం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ