ఊరికే నోరు పారేసుకుంటే మొదటికే మోసం వస్తుంది. సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇప్పుడు మాల్దీవులు అటువంటి పరిణామాలనే ఎదుర్కుంటోంది. ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీపుల పర్యటనపై ఆ దేశ మంత్రులు అణుచిత వ్యాఖ్యలు చేయడం.. మాల్దీవులకు కష్టాలను తీసుకొచ్చి పెట్టింది. అసలే టూరిజంపై ఆధారపడిన దేశం.. అందులోనూ మాల్దీవుల టూరిజంలో భారతీయులే కీలకం. అటువంటిది భారత్ ప్రధానిపైనే అణుచిత వ్యాఖ్యలు చేయడంతో మాల్దీవులకు కోలుకోలేని దెబ్బ తగిలింది.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్లలో పర్యటించారు. అక్కడ వాటర్ యాక్టివిటీస్లో పాల్గొన్నారు. సాహసాలు కోరుకునేవారు లక్ష ద్వీప్లో పర్యటించాలని.. అక్కడ టూరిజాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఫొటోలు, వీడియోలను మోడీ తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. అయితే మోడీ పోస్టులపై మాల్దీవులకు చెందిన కొందరు మంత్రులు ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకున్నారు. మా దేశంతో లక్ష ద్వీప్లకు పోలికేంటి అంటూ వ్యంగ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మాల్దీవులతో లక్ష ద్వీప్ ఏమాత్రం సరితూగదంటూ మాల్దీవుల మంత్రులు మల్షా, మజీద్, షియునా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అంతేకాకుండా భారత్లో హోటల్ గదులు అసహ్యంగా ఉంటాయని ఆ దేశ ఎంపీ జహీద్ రమీజ్ వ్యాఖ్యానించారు.
అయితే మోడీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో తీవ్ర దుమారం చెలరేగింది. మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు.. పెద్ద ఎత్తున సినీ, రాజకీయ ప్రముఖులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. క్రికెటర్ సచిన్ టెండూల్కర్, స్టార్ హీరో సల్మాన్ ఖాన్తో పాటు మరెంతో మంది భారతీయులు ఆ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో బాయ్ కాట్ మాల్దీవ్స్ హ్యాష్ ట్యాగ్తో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. అంతేకాకుండా ఇప్పటికే మాల్దీవుల ట్రిప్కు ప్లాన్ చేసుకున్న వేలాది మంది భారతీయులు తమ ట్రిప్పులను క్యానిస్ చేసుకుంటున్నారు.
భారత్ నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురవుతుండడంతో.. మాల్దీవులు అప్రమత్తమయింది. ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులపై మాల్దీవుల ప్రభుత్వం వేటు వేసింది. వారి వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగతమని.. వాటితో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ముగ్గురు మంత్రులు మల్షా షరీఫ్, మరియం షియునా, అబ్దుల్లా మజూం మజీద్లను సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. అటు మాల్దీవులకు భారత్ కీలక మిత్రదేశమని ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ పేర్కొన్నారు. మాల్దీవుల భద్రత, అభివృద్ధిలో భారత్ చాలా కీలక పాత్ర పోషిస్తోందని వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE