భారత్-దక్షిణాఫ్రికా మధ్య 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్లో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఆదివారం గౌహతి వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో రోహిత్ సేన 16 పరుగుల తేడాతో సఫారీలపై గెలిచింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో మొత్తం 458 పరుగులు నమోదవడం విశేషం. అయితే ఒత్తిడిని తట్టుకుని నిలిచిన టీమిండియా 2-0 ఆధిక్యంతో దూసుకెళ్లింది. అంతేకాకుండా, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుని, దక్షిణాఫ్రికాపై స్వదేశంలో తొలిసారి టీ20 సిరీస్ విజయాన్ని సొంతం చేసుకున్న జట్టుగా రోహిత్ సేన రికార్డ్ సృష్టించింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ మూడు వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. తన టాప్ ఆర్డర్ చెలరేగితే ఎలా ఉంటుందో ప్రత్యర్థికి తెలియజెప్పింది. తొలుత కేఎల్ రాహుల్ (57), రోహిత్ శర్మ (43) 96 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్కు పునాది వేశారు. అనంతరం సూర్యకుమార్ యాదవ్ (61) విరాట్ కోహ్లి (49 నాటౌట్) కలిసి కేవలం 40 బంతుల్లో 102 పరుగులు జోడించడంతో భారత్ 237 పరుగులు సాధించింది. ముఖ్యంగా సూర్యకుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. ఈ క్రమంలో టీ20ల్లో బంతుల పరంగా వేగంగా వెయ్యి పరుగులు చేసిన తొలి బ్యాటర్గా సూర్యకుమార్ నిలిచాడు. అతను కేవలం 573 బంతుల్లో ఈ ఫీట్ సాధించాడు. మ్యాక్స్ వెల్ (604 బాల్స్), మున్రో (635 బాల్స్) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక చివర్లో దినేష్ కార్తీక్ తన ఏడు బంతుల్లో 17 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. సఫారీ బౌలర్లలో కేశవ్ మహారాజ్ (2/23) ఒక్కడే పర్వాలేదనిపించగా, మిగిలిన బౌలర్లు తేలిపోయారు.
అనంతరం లక్ష్యఛేదనలో సఫారీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 221 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (47 బంతుల్లో 106 నాటౌట్; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీతో చెలరేగినా జట్టుకి ఓటమిని తప్పించలేకపోయాడు. అతనికి క్వింటన్ డి కాక్ (69 నాటౌట్) చక్కటి సహకారం అందించాడు. అయినా దక్షిణాఫ్రికా సాధించాల్సిన స్కోరు ఎక్కువగా ఉండటంతో విజయానికి 16 పరుగుల దూరంలో నిలిచిపోయింది. భారత్ తరఫున అర్ష్దీప్ సింగ్ (2/62), అక్షర్ పటేల్ (1/53) వికెట్లు తీశారు. రాహుల్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇక చివరి, మూడో టీ20 మ్యాచ్ మంగళవారం ఇండోర్లో జరుగనుంది.
గ్రౌండ్లో పాము కలకలం..
భారత్ ఇన్నింగ్స్ 7వ ఓవర్ పూర్తయి 8వ ఓవర్ మొదలయ్యే సమయంలో ఒక పాము హఠాత్తుగా మైదానంలోకి వచ్చింది. దీంతో ఆటగాళ్లు ఒక్కసారిగా అవాక్కయారు. స్టేడియం బయటినుంచి పాము గ్రౌండ్లోకి రావడంతో దాదాపు అది నిముషాలు మ్యాచ్కు అంతరాయం కలిగింది. ఎక్స్ట్రా కవర్వైపు నుంచి పాము ఫీల్డ్లోకి వచ్చినట్లు గుర్తించిన గ్రౌండ్ సిబ్బంది వెంటనే దానిని బంధించి బయటకు తీసుకెళ్లడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత మ్యాచ్ సాఫీగా సాగింది.
స్కోరు బోర్డు
భారత్: రాహుల్ (ఎల్బీ) మహారాజ్ 57, రోహిత్ (సి) స్టుబ్స్ (బి) మహారాజ్ 43, విరాట్ (నాటౌట్) 49, సూర్యకుమార్ (రనౌట్) 61, దినేశ్ (నాటౌట్) 17, ఎక్స్ట్రాలు: 10, మొత్తం: 20 ఓవర్లలో 237/3.
బౌలింగ్: రబాడ 4-0-57-0, పార్నెల్ 4-0-54-0, ఎంగిడి 4-0-49-0, మహారాజ్ 4-0-23-2, అన్రిచ్ 3-0-41-0, మార్క్రమ్ 1-0-9-0.
దక్షిణాఫ్రికా: బవుమా (సి) కోహ్లీ (బి) అర్ష్దీప్ 0, డికాక్ (నాటౌట్) 69, రిలీ (సి) కార్తీక్ (బి) అర్ష్దీప్ 0, మార్క్రమ్ (బి) అక్షర్ పటేల్ 33, మిల్లర్ (నాటౌట్) 106, ఎక్స్ట్రాలు: 13, మొత్తం: 20 ఓవర్లలో 221/3.
బౌలింగ్: దీపక్ 4-1-24-0, అర్ష్దీప్ 4-0-62-2, అశ్విన్ 4-0-37-0, అక్షర్ 4-0-53-1, హర్షల్ 4-0-45-0.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY