బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న పింక్ టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. 238 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను ఓడించి 2-0తో సిరీస్ని కైవసం చేసుకుంది భారత్. దీంతో 2 మ్యాచ్ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది టీమిండియా. ఒక వికెట్ నష్టానికి 28 పరుగుల వద్ద మూడో రోజు ఆట కొనసాగించిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్ను 208 పరుగుల వద్ద ముగించింది. కెప్టెన్ దిముత్ కరుణరత్నే 107 పరుగులు చేయడం మూడవ రోజు ఆటలో హైలైట్. టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా (3/23), స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (4/55) భారత్ విజయంలో కీలకపాత్ర పోషించారు.
447 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక టీ సమయానికి 4 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. కెప్టెన్ కరుణరత్నే, కుశాల్ మెండిస్ రెండో వికెట్కు 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కుశాల్ మెండిస్ హాఫ్ సెంచరీ చేశాడు. అయితే, వరుస విరామాలలో వికెట్లు పడటంతో పరాజయం పాలయ్యింది. ఫెర్నాండో చివరి వికెట్ గా అశ్విన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఈ వికెట్తో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో 100 వికెట్లు తీసిన తొలి బౌలర్గా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. అతను ఇప్పుడు 442 టెస్ట్ వికెట్లు సాధించి టెస్ట్ క్రికెట్లో ఆల్ టైమ్ అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా బౌలర్ డేల్ స్టెయిన్ ను అధిగమించాడు. శ్రీలంకతో జరిగిన రెండు టెస్టులను టీమిండియా మూడు రోజుల్లోనే గెలవటం విశేషం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ