ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లండ్తో శుక్రవారం మొదలైన కీలక ఐదో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ సెంచరీతో చెలరేగాడు. టాపార్డర్ విఫలమైనా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి ఇన్నింగ్స్ ని నిలబెట్టాడు. ఈ క్రమంలో రిషభ్ పంత్ తన ఐదో టెస్టు సెంచరీని సాధించాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 73 ఓవర్లలో 7 వికెట్లకు 338 పరుగులు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్కు శుభ్మన్ గిల్ (17), చతేశ్వర్ పుజారా (13) శుభారంభం ఇవ్వలేకపోయారు. అనంతరం క్రీజులోకి వచ్చిన హనుమ విహారి (20), విరాట్ కోహ్లీ (11), శ్రేయస్ అయ్యర్ (15) కూడా భారీ స్కోరు సాధించలేకపోవడంతో ఒక దశలో ఇండియా 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ సమయంలో క్రీజులో అడుగు పెట్టిన రిషభ్ పంత్.. వచ్చిందే తడవుగా భారీ షాట్లతో చెలరేగిపోయాడు. టీ20 తరహలో బ్యాటింగ్ చేస్తూ కేవలం 89 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో 17 సంవత్సరాల క్రితం మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోని నెలకొల్పిన రికార్డుని బ్రేక్ చేశాడు. 2005లో పాకిస్థాన్తో జరిగిన టెస్టులో 93 బంతుల్లో ధోనీ ఈ ఫీట్ సాధించాడు. సెంచరీ అనంతరం కూడా తన జోరు ఏమాత్రం తగ్గలేదు. బౌలర్ ఎవరైనా బాదడమే పనిగా పెట్టుకున్న పంత్ చివరికి (111 బంతుల్లో 19 ఫోర్లు, 4 సిక్సర్లు) 146 పరుగుల స్కోరు వద్ద అవుట్ అయ్యాడు. ఇంగ్లాండ్ ప్రధాన బౌలర్లందరూ చేతులెతేయడంతో ఈ జోడీని విడదీయడానికి కెప్టెన్ స్టోక్స్, మాజీ కెప్టెన్ రూట్ను బౌలింగ్ దించాల్సి వచ్చింది. అయితే అతడి బౌలింగ్ లోనూ సత్తా చాటిన పంత్.. రెండు ఫోర్లు, ఒక భారీ సిక్సర్ సాధించాడు. అయితే తర్వాతి బంతికి స్లిప్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
దీంతో జడేజా (83 బ్యాటింగ్) తో కలిసి ఆరో వికెట్కు 222 పరుగులు జోడించాడు. ఇది కూడా ఒక రికార్డు కావడం విశేషం. విదేశాల్లో ఈ వికెట్కు భారత్కిదే అత్యుత్తమం. గతంలోనూ సచిన్-అజరుద్దీన్ జోడీ ఇన్నే పరుగులు సాధించింది. ఇక ఆసియాకు ఆవల నాలుగు సెంచరీలు చేసిన ఏకైక భారత వికెట్ కీపర్గా పంత్ నిలిచాడు. అలాగే ఓ క్యాలెండర్ ఏడాదిలో రెండు శతకాలు సాధించిన నాలుగో భారత వికెట్ కీపర్ అయ్యాడు. ఆట ముగిసే సమయానికి షమితో కలిసి జడేజా 83 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. ఇక శనివారం జడేజా అండతో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలని భారత్ భావిస్తోంది.
ఇండియా స్కోరుబోర్డు
బ్యాటింగ్: గిల్ (సి) క్రాలే (బి) అండర్సన్ 17, పుజార (సి) క్రాలే (బి) అండర్సన్ 13, విహారి (ఎల్బీ) పాట్స్ 20, కోహ్లీ (బి) పాట్స్ 11, పంత్ (సి) క్రాలే (బి) రూట్ 146, అయ్యర్ (సి) బిల్లింగ్స్ (బి) అండర్సన్ 15, జడేజా (బ్యాటింగ్) 83, శార్దూల్ (సి) బిల్లింగ్స్ (బి) స్టోక్స్ 1, షమి (బ్యాటింగ్) 0, ఎక్స్ట్రాలు 32, మొత్తం 73 ఓవర్లలో 338/7
బౌలింగ్: అండర్సన్ 19-4-52-3, బ్రాడ్ 15-2-53-0, మాథ్యూ పాట్స్ 17-1-85-2, లీచ్ 9-0-71-0, స్టోక్స్ 10-0-34-1, రూట్ 3-0-23-1.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ