టీమిండియా టెస్టుల్లో చరిత్ర సృష్టించేందుకు ఒక అరుదైన అవకాశం ఎదురు చూస్తోంది. సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలుచుకునేందుకు ఒక్క విజయం చాలు. ప్రపంచ టెస్టు చరిత్రలో అన్ని దేశాలపై.. వారి సొంతగడ్డపై సిరీస్ విజయం సాధించిన అద్వితీయ రికార్డును భారత జట్టు సొంతం చేసుకుంటుంది. వెస్టిండీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా.. ఇలా అన్ని పెద్ద జట్లను వారి స్వదేశంలో మట్టి కరిపించిన టీమిండియాకు, దక్షిణాఫ్రికా గడ్డపై మాత్రం సిరీస్ విజయం అందని ద్రాక్షగానే ఉండిపోయింది. దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నా ఇంతవరకూ సిరీస్ గెలిచే అవకాశం టీమిండియాకు దక్కలేదు. ఇప్పుడా సువర్ణావకాశం చేజిక్కించుకునేందుకు వాండరర్స్ మైదానం ఆహ్వానిస్తోంది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య సోమవారం నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ లో విరాట్ సేన విజయం సాధిస్తే, సిరీస్ విజేతగా చరిత్రను లిఖించవచ్చు.
మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ బౌలింగ్ దళం తన సత్తా చూపింది. బ్యాటింగ్ కన్నా బౌలింగ్ సమర్ధవంతంగా ఉండటం వల్లనే తొలి టెస్టులో విజయం అందుకుంది భారత్. సిరాజ్, షమీ, బుమ్రాలతో బౌలింగ్ దళం దుర్భేద్యంగా ఉంది. బ్యాటింగ్లో.. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ల ఓపెనింగ్ జోడీ, మిడిలార్డర్లో రహానే ఆకట్టుకున్నారు. కానీ, కెప్టెన్ కోహ్లీ మరియు పుజారా భారీ స్కోర్లు చేయలేకపోవటం కొంత ఆందోళన కలిగించే విషయం. అయితే, వాండరర్స్లో భారత్ కు ఘనమైన రికార్డు ఉండటం శుభసూచకం. ఇక్కడ ఐదు మ్యాచ్లాడిన భారత్ రెండు గెలిచి, మరో మూడు టెస్టుల్ని ‘డ్రా’గా ముగించింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న రెండవ టెస్ట్ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది గెలిచి చరిత్ర సృష్టించాలని కోహ్లీ సేన భావిస్తోంది. అయితే, టెస్ట్ జరిగే ఐదు రోజుల్లో.. నాలుగు రోజులపాటు వర్షం పడనుందనే వార్త భారత శిబిరంలో కొంత ఆందోళన కలిగిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ