కరోనా నియంత్రణ చర్యలో భాగంగా దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే పలు రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. కేరళలో ఏప్రిల్ 16, గురువారం నాటికి 394 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 147 మంది ప్రస్తుతం చికిత్స తీసుకుంటుండగా, 245 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా ఈ వైరస్ వలన ఇద్దరు మరణించారు. ఈ నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఏప్రిల్ 20 నుంచి లాక్డౌన్ అమలులో కొన్ని రంగాలకు మినహాయింపులు ఇవ్వబోతున్నట్టు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో బేసి-సరి విధానంలో వాహనాలను రోడ్ల మీదకు అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. గర్భిణీలు, చికిత్స కోసం మరియు మరణం సంబంధిత కారణాలతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మళయాలీలను రాష్ట్రంలోకి అనుమతించనున్నారు. అలాగే కేంద్రం హాట్స్పాట్లుగా గుర్తించిన జిల్లాల్లో మార్పులు చేయాలని కేరళ రాష్ట్ర మంత్రివర్గం ఏప్రిల్ 16, గురువారం నాడు నిర్ణయించింది. కరోనా ప్రభావం ఉన్న జిల్లాలను నాలుగు జోన్లుగా విభజించేందుకు కేంద్రం అనుమతిని కోరినట్లు ప్రకటించారు.
నాలుగు జోన్లుగా విభజించే విధానం:
- కాసర్గడ్, కన్నూరు, మలప్పురం, కోజికోడ్ జిల్లాలను ఒక జోన్గా పరిగణిస్తూ, ఇక్కడ కరోనా వ్యాప్తి ప్రభావం అధికంగా ఉన్నందున మే 3 వరకు లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయనున్నట్లు తెలిపారు.
- రెండో జోన్లో పతనంతిట్ట, ఎర్నాకులం, కొల్లాం జిల్లాలు చేర్చి అక్కడ హాట్స్పాట్ జోన్లను సీల్ చేయనున్నారు.
- మూడో జోన్గా అలప్పుజ, తిరువనంతపురం, పాలక్కాడ్, త్రిసూర్, వయనాడ్ జిల్లాలను పరిగణిస్తూ లాక్డౌన్ నియమ నిబంధనలను పాక్షికంగా సడలించనున్నారు.
- కొట్టాయం, ఇడుక్కి జిల్లాలలో కరోనా కేసులు నమోదుకాకపోవడంతో నాలుగో జోన్ గా పరిగణించి సడలింపులు ఇవ్వనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu