కాంగ్రెస్ నేతల తీరుపై లోక్సభలో ప్రధాని మోదీ అసహనం వ్యక్తం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే చర్చలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభలో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా.. ఆయన కాంగ్రెస్ నేతలకు చురకలు అంటించారు. అధికారాన్ని కోల్పోయినప్పటికీ కాంగ్రెస్ నేతలకు మాత్రం గర్వం, అహంకారం తగ్గట్లేదన్నారు. వరుసగా ఎన్ని ఓటములు ఎదురవుతున్నా సరే కాంగ్రెస్ నేతల తీరు మారడం లేదన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయిందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా.. లోక్సభలో తెలంగాణ ప్రస్తావన తెచ్చారు మోదీ. తెలంగాణ ఇచ్చినా కూడా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్కు అధికారం దక్కలేదని మోదీ పరిహసించారు.
కాంగ్రెస్ పార్టీ తీరు చూస్తుంటే.. మరో శతాబ్దం వరకూ అధికారంలోకి రాకూడదని గట్టి పట్టుదలతో ఉన్నట్టుంది ఆ పార్టీ అని ప్రధాని ఎద్దేవా చేశారు. గెలవాలన్న కాంక్షే వారిలో ఏ కోశానా కన్పించడం లేదన్నారు. అందుకే, తనకేదీ దక్కనప్పుడు అన్నింటినీ పాడుచేద్దామనే స్థాయికి దిగజారింది అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ప్రతిదాన్నీ గుడ్డిగా వ్యతిరేకించడమే పనిగా పెట్టకుందని.. వేర్పాటువాదాన్ని పెంచి పోషిస్తోందని మండిపడ్డారు. రెండేళ్లుగా దేశం కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం రాజకీయం చేస్తున్నారని ప్రధాని మండిపడ్డారు. విభజించి పాలించడమే కాంగ్రెస్ ఎజెండా.. టుక్డే గ్యాంగులకు లీడర్గా మారింది.. ఇప్పటికీ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది ఆ పార్టీ అని ప్రధాని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ