మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం చివరి దశకు చేరుకుంది. ముందుగా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో మార్చ్ 20, శుక్రవారం సాయంత్రం 5 గంటల లోపు ముఖ్యమంత్రి కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బలపరీక్షలో నిరూపించుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో బలపరీక్షకు ముందే ముఖ్య మంత్రి కమల్ నాథ్ తన పదవికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాసేపట్లో మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించునున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో కమల్ నాథ్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది.
సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం కమల్ నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత 15 నెలలుగా రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డానని, ఈ దశలో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి కుట్రలు పన్నిందన్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కర్నాటకలోని బెంగళూరులో బంధించారని ఆరోపించారు. గత ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ప్రజలు ఐదేళ్ల పాటు పాలన కట్టబెడితే బిజెపి అందుకు వ్యతిరేకంగా వ్యవహరించింది అన్నారు. అధికారంలోకి వచ్చాక దాదాపు 20 లక్షల మంది రైతులకు రుణ మాఫీ చేశామని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ బిజెపి నాయకులు తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని కమల్ నాథ్ మండిపడ్డారు.
[subscribe]