మహారాష్ట్రలో రాయ్గఢ్ జిల్లాలోని మహాద్ నగరంలో ఆగస్టు 24, సోమవారం సాయంత్రం ఐదు అంతస్తుల భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే. సంఘటన స్థలంలో గత 22 గంటల నుంచి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డిఆర్ఎఫ్) బృందాలు సహాయక చర్యలు చేపడుతూనే ఉన్నాయి. భవనం శిధిలాల కింద 75 మందికి పైగా చిక్కుకుపోగా, సహాయ బృందాలు 60 మందిని బయటకు తీసి రక్షించారు. కాగా ఈ ఘటనలో ఇప్పటికి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. శిధిలాల కింద చిక్కుకుపోయిన వారిలో ఇంకా పలువురి ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ ఐదు అంతస్తుల భవనంలో 45 ప్లాట్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఈ ప్రమాద ఘటనలో ప్రాణనష్టం జరగడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విచారాన్ని వ్యక్తం చేశారు. ‘‘మహారాష్ట్ర లోని రాయ్గఢ్ లో గల మహద్ లో భవనం కూలిపోయిన సంగతి తెలిసి ఖిన్నుడినయ్యాను. ఈ ఘటనలో ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఎన్డిఆర్ఎఫ్ బృందాలు, ఇంకా స్థానిక యంత్రాంగం సంఘటన స్థలం వద్ద సాధ్యమైన సహాయాన్నంతా అందిస్తున్నారు’’ అని ప్రధాని మోదీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu