లోక్సభలో సోమవారం కొద్దిసేపు హైడ్రామా చోటుచేసుకుంది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో జరిగిన ఈ అనూహ్య పరిణామంతో సభలో కలకలం రేగింది. రేవంత్ రెడ్డి హిందీ యాసపై నిర్మల చేసిన వ్యాఖ్యలు.. దానికి రేవంత్ ఘాటైన సమాధానం ఇవ్వడంతో సభలో ఉత్కంఠ పరిస్థితి ఏర్పడింది. అసలు ఏమైందంటే.. ప్రశ్నోత్తరాల సందర్భంగా లోక్సభలో రేవంత్ రెడ్డికి ప్రశ్న అడిగే అవకాశం లభించింది. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు డాలర్తో రూపాయి మారకం విలువ 66 వద్ద ఉన్నప్పుడు రూపాయి ఐసీయూలో ఉందని చెప్పారని, అయితే ప్రస్తుతం అమెరికా డాలరుతో పోలిస్తే భారత్ రూపాయి మారకం విలువ 83.20 ఉందని అన్నారు. ఈ లెక్కన చూస్తే రూపాయి మార్చురీ వైపు వెళుతున్నట్లు అనిపిస్తుందని, పరిస్థితి చక్కదిద్దడానికి కేంద్రం వద్ద ఏదైనా పరిష్కారం ఉందా? అని ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
అనంతరం దీనిపై ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. తెలంగాణ ఎంపీ రేవంత్ రెడ్డి పేలవమైన హిందీ భాషలో మాట్లాడారని, నేను కూడా అలాంటి హిందీలోనే జవాబు ఇస్తానని వ్యాఖ్యానించారు. దీనిపై రేవంత్ తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. సభలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి జవాబు చెప్పాలే కానీ, ఇలా తన భాషపై అవహేళన చేయడం ఏంటని ఘాటుగా బదులిచ్చారు. తాను శూద్రుడిని కాబట్టి స్వచ్ఛమైన హిందీ రాదని, ఆమె అగ్రకులం కాబట్టి స్వచ్ఛమైన హిందీ వస్తుందేమోనని కూడా ప్రతిస్పందించారు. ఈ క్రమంలో రేవంత్ వ్యాఖ్యలపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం తెలిపారు. సభలో ఎవరూ కుల, మతాల ప్రస్తావన తేరాదని, ఎవరైనా ఆ పదాలు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ